టీమిండియా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్.. వన్డేల్లోనైనా సత్తాచాటాలని భావిస్తోంది. అందుకే భారత ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవం ఉన్న హార్డ్ హిట్టర్ను జట్టులోకి ఎంపిక చేసింది.
వరుణుడి కారణంగా భారత్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకున్న వెస్టిండీస్ జట్టు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు కసరత్తులు చేస్తోంది. వాస్తవానికి తొలి టెస్టులో కనీస ప్రతిఘటన లేకుండా మూడు రోజుల్లోనే రోహిత్సేనకు మ్యాచ్ అప్పగించేసిన కరీబియన్లు.. రెండో టెస్టులో శక్తికి మించి పోరాడారు. ధనాధన్ షాట్లు ఆడి వికెట్ పారేసుకునే ఆనవాయితీని పక్కన పెట్టి క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక దశలో వర్షం రాకున్నా.. విండీస్ తమ పోరాటంతోనే ఈ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంటుంది అనిపించింది. అయితే వారి ప్రయత్నానికి వర్షం కూడా సాయం చేయడంతో రెండో టెస్టు డ్రా అయింది. ఇక రెండు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి. వన్డే సిరీస్లో భాగంగా గురువారం తొలి పోరు జరుగనుంది. దీని కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి బ్యాటర్గా గుర్తింపు తెచ్చుక్ను షిమ్రాన్ హెట్మైర్కు జట్టులో చోటు దక్కింది. చాన్నాళ్ల తర్వాత హెట్మైర్ జాతీయ జట్టులోకి రాగా.. మాజీ కెప్టెన్లు నికోలస్ పూరన్, జాసెన్ హోల్డర్ సెలెక్షన్కు అందుబాటులో లేకుండా పోయారు. విండీస్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్న హెట్మైర్.. తిరిగి టీమ్లో చేరడంతో కరీబియన్ల బలం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2021లో చివరిసారి విండీస్ తరఫున వన్డే మ్యాచ్ ఆడిన హెట్మైర్.. ఆ తర్వాత పలు కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. హెట్మైర్తో పాటు పేస్ బౌలర్ ఒషానో థామస్ కూడా ఈ సిరీస్కు ఎంపికయ్యాడు. క్రికెట్ చరిత్రలో తొలిసారి వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్.. బలమైన భారత జట్టుకు 50 ఓవర్ల ఫార్మాట్లో ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి.
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. టీమిండియా తమ పూర్తి స్థాయి సామర్థ్యంతోనే బరిలోకి దిగాలని చూస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా ప్రధాన ప్లేయర్లందరూ ఈ సిరీస్లో ఆడనున్నారు. వరల్డ్ కప్ నేపథ్యంలో యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం లేకపోలేదు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఈ సిరీస్కు అందుబాటులో లేకుండా పోగా.. వారి స్థానాల్లో ఎవరు ఆకట్టుకుంటారో చూడాలి.
వన్డే సిరీస్కు వెస్టిండీస్ జట్టు: షై హోప్ (కెప్టెన్), పావెల్, అథన్జె, యానిక్, కార్టీ, డ్రాక్స్, హెట్మైర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మయేర్స్, మోటియా, సీల్స్, షెఫర్డ్, సిన్ౖక్లెర్, ఒషానో థామస్.