పేపర్ లీకేజీ అంశం అటు టీఎస్పీఎస్సీని, ఇటు ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచి ఉద్యోగ పరీక్ష పత్రాలు లీక్ కావడం పట్ల నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను ముట్టడించిన విద్యార్ధి సంఘాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ బోర్డును పీకేశారు.. గేట్లు దూకి లోనికి చొచ్చుకెళ్లారు.
తెలంగాణలో ‘ప్రవీణ్ లీక్స్’ చిచ్చు రేపింది. వేలకు వేలకు ఖర్చుపెట్టి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అహర్నిశలు కష్టపడుతోన్న నిరుద్యోగులకు పరీక్షా పత్రాలు లీక్ అన్న ఘటన ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇప్పటికే మార్చి12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేసిన కమిషన్, మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం (మార్చి 14) చైర్మన్ జనార్దన్రెడ్డి అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన కమిషన్ కాసేపట్లో తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ప్రతిష్టాత్మక గ్రూప్-1 పరీక్ష లీకైనట్లు వార్తలు వస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసినట్లు స్పష్టమైంది. పిఏగా పనిచేస్తూనే అతడు పరీక్ష రాసినట్లు పోలిసులు నిర్ధారించారు. అతడికి సంబంధించిన OMR షీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రాంగ్ బబులింగ్ తో డిస్ క్వాలిఫై అయినా, ఆన్సర్ కీతో చెక్ చేసుకుంటే అతడికి ప్రిలిమ్స్లో 150 మార్కులకు గాను 103 మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో గ్రూప్ -1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీక్ అయిందన్న వదంతులు వ్యాపిస్తున్నాయి. లీక్ చేశాడా? లేదా? లీక్ చేస్తే అతనొక్కడే ఉపయోగించాడా? మరెవరికైనా ఇచ్చాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, గతేడాది అక్టోబరు 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్లో 1:50 నిష్పత్తిలో 25,150 మంది మెయిన్స్కు ఎంపికైన సంగతి తెలిసిందే.
Group-1 Govinda?
This is the OMR sheet of praveen, A1 in #Tspsc paper leak.
He got 103 marks
My friend cleared UPSC mains in 2021 got 92.
Which means this paper also leaked!
Thank you for spending more time in #delhiliquorpolicy @KTRBRS @BRSHarish @KTRoffice @HarishRaoOffice pic.twitter.com/16ku4H4Ry1— VPK (@Vijay96460168) March 14, 2023
మొదట కంప్యూటర్ హ్యాక్ కావడంతో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని బోర్డు అధికారులు పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి అందరికీ విదితమే. విచారణ చేపట్టిన పోలీసులు.. కంప్యూటర్ హ్యాక్ కాలేదని, ఇది ఇంటిదొంగల పనేనని తేల్చారు. ఉద్యోగులకు అదుపులోకి తీసుకొని విచారించగా, ప్రవీణ్ బాగోతం బయటపడింది. సెక్రటరీ పిఏగా పనిచేస్తున్న ప్రవీణ్, మహబూబ్ నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన రేణుక అనే మహిళ మాయలో పడి అత్యంత భద్రత నడుమ ఉండే ప్రశ్నాపత్రాలను దొంగలించినట్లు స్పష్టమైంది. అలా మొదట టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో విచారణ చేస్తున్న కొద్దీ ప్రవీణ్ అక్రమాలు, రాసలీలలు ఒకటి వెంట మరొకటి బయటకు వస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్గా 2017లో టీఎస్పీఎస్సీలో విధుల్లోకి చేరిన ప్రవీణ్, నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్లో పనిచేశాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్ సెక్షన్కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకొని వారితో సాన్నిహిత్యం పెంచుకునేవాడు. ఈ క్రమంలో అతడు పలువురు మహిళలతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి మొబైల్ లో వందల సంఖ్యలో మహిళల ఫోన్ నెంబర్లు గుర్తించారు. అంతేకాదు.. అతడి వాట్సాప్ చాట్ లో మహిళల నగ్న ఫోటోలు, వీడియోలు ఉండటం చూసి విస్తుపోయారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. 2017 నుంచి టీఎస్పీఎస్సీలోనే పని చేస్తున్న ప్రవీణ్ ఇప్పటి వరకు ఎన్ని పరీక్షల పేపర్లను లీక్ చేశాడనే అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.