అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్లకోసారి నిర్వహించే టీ20 ప్రపంచకప్ ను వచ్చే సంవత్సరం జూన్ 4న ప్రారంభించాలని చూస్తోంది. సాధారణంగా ఏడాది చివర్లో జరిగే ఈ మెగా టోర్నీని.. ముందుగానే ముగించాలని భావిస్తోంది.
అగ్రరాజ్యం అమెరికా తొలిసారి ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం (2024) జూన్ 4 నుంచి 30 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహణకు అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. టీ20 సిరీస్ లో భాగంగా చివరి రెండు టీ20లను అమెరికాలో ఆడనుంది. అనంతరం ఐసీసీ సభ్యులు అక్కడి మైదానాలను పరిశీలించనున్నట్లు సమాచారం. వేదికలతో ఐసీసీ సభ్యులు సంత్రుప్తి చెందితే.. ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు చేసే పని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఓ వెబ్ సైట్ కథనం ప్రచూరించింది. ఇదే ఫైనల్ అయితే.. ఐపీఎల్ 17వ సీజన్ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
ప్రతి ఏడాది వేసవిలో నిర్వహించే ఐపీఎల్ ను వచ్చే సంవత్సరం మార్చి 23 నుంచి మే 29 మధ్య నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అంటే మే 29 న ఐపీఎల్ 17వ సీజన్ మెగా ఫైనల్ జరుగనుంది. ఆ తర్వాత ఐదు రోజుల విరామంతోనే విశ్వ సమరం మొదలు కానుంది. ప్రపంచంలోని అన్నీ దేశాల ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్న నేపథ్యంలో.. మరి వాళ్లకు తగినంత విశ్రాంతి లేకపోతే ఎలా అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీ20 ప్రపంచకప్ కు సన్నద్ధం కావాలనే ఆలోచనలో విదేశీ ఆటగాళ్లకు ఆయా దేశాల బోర్డులు ఐపీఎల్లో ఆడే అవకాశం ఇవ్వకపోతే ఎలా అనేది పెద్ద సమస్యగా పరిణమించింది.
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగగా.. ఈ సారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాయి. అయితే అమెరికాలో పలు మైదానాలకు అంతర్జాతీయ హోదా లేకపోవడంతో ఆ దిశగా ఐసీసీ చర్యలు ప్రారంభించింది. మెగాటోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. వాటిని నాలుగు గ్రూప్ లుగా విభజించి ఒక్కో జట్టు మిగిలిన నాలుగు జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. అక్కడ కూడా రెండు గ్రూప్ లుగా విభజించి ఇదే తరహాలో మ్యాచ్ లు నిర్వహిస్తారు. అందులో తొలి రెండు ప్లేస్ ల్లో నిలిచిన టీమ్ లు సెమీఫైనల్ కు క్వాలిఫై కానున్నాయి. మరి ఇదే షెడ్యూల్ కొనసాగుతుందా.. లేక ఏమైనా మార్పులు సంభవిస్తాయా అనేది తేలాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.