చిత్ర పరిశ్రమలో వరుసగా విషాద వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే పలువురు బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ప్రముఖ నటులు తుది శ్వాస విడిచారు. తాజాగా బాలీవుడ్ నటులు సతీష్ కౌశిక్ మృతి చెందగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ నిర్మాత తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సినీ పరిశ్రమలో వరుసగా చేదు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పలువురు నటులు, దర్శక నిర్మాతలు కాలం చేశారు. కృష్ణం రాజుతో మొదలుకుని కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, నటి జమున, సింగర్ వాణి జయరాం, దర్శకుడు విశ్వనాథ్, నటుడు తారకరత్నమరణాలు తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అటు బాలీవుడ్లో కూడా విషాదాలు వెంటాడుతున్నాయి. తెలుగు, బాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ప్రవీణ్ అనుమోలు మరణించిన వార్త మరవకముందే నటుడు, నిర్మాత సతీష్ కౌశిక్ కూడా కన్నుమూశారు. ఈ మరణ వార్తలను సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అంతేకాకుండా తాను కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు రజనీకాంత్ వెల్లడించగా.. ఇప్పుడు మరో దర్శకుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని సమాచారం.
ప్రముఖ దర్శకుడు,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్యామ్ బెనగల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన రెండు కిడ్నీలు దెబ్బతినడంతో ఇంట్లో ఉండి డయాలసిస్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుతున్న నివేదికల ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రికి వెళ్లలేక, కదల్లేని పరిస్థితిలో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై శ్యామ్ బెనగల్ కుమార్తె, కాస్ట్యూమ్ డిజైనర్ పియా బెనెగల్ స్పందించారు. ఆ సమాచారం తప్పు అని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో తన తండ్రి ఆరోగ్యం పట్ల చక్కర్లు కొడుతున్న న్యూస్ అసత్య ప్రచారమని తెలిపారు. ఆయన బాగానే ఉన్నాడని, అయితే ఇటీవల ఆఫీసుకు రావడం లేదని అన్నారు. ఆయనకు కాస్త విరామం కావాలని, త్వరలోనే కార్యాలయానికి తిరిగి వస్తారని పేర్కొన్నారు .ఆ మాత్రం దానికే కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్ అని రాసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది.
ప్రస్తుతం శ్యామ్ బెనగల్ వయస్సు 88 సంవత్సరాలు. ఆయన 1934లో హైదరాబాద్ లోని తిరుమల గిరిలో జన్మించారు. అంకుర్, నిషాంత్, మంతన్, భూమిక, జుబేదా, ఆరోహన్, సుభాష్ చంద్రబోస్, వెల్ డన్ అబ్బా వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నంది, ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు 18 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. శ్యామ్ బెనగల్ చిత్రపరిశ్రమకు చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2005లో ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 1976లో పద్మ శ్రీ , 1991లో పద్మ విభూషణ్ అవార్డు అందజేసింది. శ్యామ్ బెనగల్కు సొంతంగా సహ్యాద్రి ఫిలింస్ అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. తను తీసిన సినిమాల ఆధారంగా ద చర్నింగ్ విత్ విజయ్ టెండుల్కర్, సత్యజిత్ రే, ద మార్కెట్ప్లేస్ అనే మూడు పుస్తకాలు రాశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మొదటి ప్రధాని షైక్ ముజ్బర్ రెహమాన్ జీవిత కథ ఆధారంగా ముజీబ్: ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ అనే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు.