హైదరాబాద్- తెలంగాణలో కిట్టీ పార్టీల పేరుతో పలు రంగాల ప్రముఖులను మభ్య పెట్టి కోట్ల రూపాయలను దోచుకున్న శిల్పా చౌదరి కేసు అంతకంతకు మలుపు తిరుగుతోంది. ప్రముఖుల పిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు శిల్పా చౌదరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే రిమాండ్లో ఉన్న శిల్పా చౌదరిని పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారణ జరిపుతున్నారు.
శుక్రవారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి శిల్పా చౌదరిని తీసుకెళ్లిన నార్సింగి పోలీసులు సుమారు ఆరు గంటల పాటు విచారించారు. శిల్పా చౌదరి పోలీసుల విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో ముందు భోరున విలపించడంతో పాటు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు మొండికేసినట్లు సమాచారం. ఐతే ఆ తరువాత ఈ కేసుకు సంబందించి శిల్పా చౌదరి కీలక విషయాలను వెల్లడించినట్లు చర్చ జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన డబ్బును ఎక్కడికి తరలించిందనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో శిల్పా చౌదరి షాకింగ్ విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. ప్రముఖులు తమ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు తన దగ్గర పెట్టుబడులు పెట్టారని శిల్పా చౌదరి చెప్పినట్లు తెలుస్తోంది. తనకు చాలా మంది డబ్బు ఇచ్చారని ఆమె ఒప్పుకున్నట్లు చర్చ జరుగుతోంది.
నార్సింగి పోలీసులు శిల్పా చౌదరి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారట. ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే పోలీసులు కొందరిని విచారించారు. అంతే కాదు శిల్పా చౌదరి బ్యాంకు లావాదేవీలు, బినామీలు, బ్యాంకు ఖాతాలపై పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరించారు. శనివారం రెండో రోజు శిల్పా చౌదరిని మరోసారి పోలీసులు శిల్పా చౌదరిని ప్రశ్నించనున్నారు. ఇక తనకు బెయిల్ మంజూరు చేయాలన్న శిల్ప పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.