హైదరాబాద్- తెలంగాణ రైతులకు తీపి కబురు. ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు రైతుల భూముల వివరాలు అందాయి. ఈ నెల 10 నాటికి ధరణి పోర్టల్లో నమోదైన భూముల పట్టాదారులు, అటవీ భూముల యాజమాన్య హక్కులు పొందిన వారు రైతుబంధు పథకానికి అర్హులని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
ఈ యాసంగి సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు, 152.91 లక్షల ఎకరాలకు, మొత్తం 7,645.66 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులైన 94 వేల మంది రైతుల ఆధీనంలోని 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతు బంధు పెట్టుబడి సాయాన్ని అందిచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక దశలవారిగా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ కానుంది.
మంగళవారం ఎకరాలోపు భూమి ఉన్నవారికి, బుధవారం 2 ఎకరాలు, గురువారం మూడెకరాలు.. ఇలా ప్రతి రోజూ ఎకరం చొప్పున పెంచుతూ రైతు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 7 విడతల్లో రైతుల ఖాతాల్లో మొత్తం 43,036.63 కోట్ల రూపాయలు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ప్రస్తుతం ఈ సీజన్ లో అందిస్తున్న రైతు బంధు 7,645.66 కోట్లను కలిపితే మొత్తం 50 వేల కోట్ల రూపాయల మైలురాయిని చేరుకుంటామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో ఒకటిగా రోమ్ లో 2018 నవంబరులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్ఏవో గుర్తించిందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. తెలంగాణ సర్కార్ అమలు చస్తున్న రైతు బంధు పధకాన్ని చూసి కేంద్ర ప్రభుత్వంతో పాటు, చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని నీరంజన్ రెడ్డి అన్నారు.