దేశంలోని అన్నీ రాష్ట్రాలలో కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇందుకు మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అతీతం కాదు. తెలంగాణలో ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ వ్యాపార కార్యకలాపాలకు కర్ఫ్యూ సడలింపు ఉంది. ఉదయం 10 తరువాత మాత్రం సరైన కారణాలు లేకుండా బయటకి వస్తే ఎక్కడి వారిని అక్కడే పోలీసులు ఆపేస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇలా బయటకి వచ్చే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇక ఆకతాయిలుగా రోడ్లపై తిరిగే వారినైతే నేరుగా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఇంత స్ట్రిక్ట్ గా కోవిడ్ నిబంధనలు అమలు అవుతున్నాయి.ఇలాంటి సమయంలో లాక్డౌన్ నిబంధనలు పాటించకపోవడంతో తెలంగాణ పోలీసులు ఓ ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఓ వాహనాన్ని సీజ్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి కారణం అవుతోంది. వికారాబాద్ జిల్లాలోని కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాండూర్ మండలం గౌతాపూర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అక్కడికి వచ్చింది. బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా.. వారు పెళ్లికి వెళ్తున్నట్టు చెప్పారు. లాక్డౌన్ సమయంలో పెళ్లికి.. వధువు తరఫు వారికి 20 మందికి మాత్రమే పర్మిషన్ ఉందని పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటించనందుకు పెళ్లి కూతురు తండ్రితో పాటు.., ఆర్టీసీ బస్సు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై డిపో మేనేజర్ ని వివరణ కోరగా.., తాము కూడా 20 మందికి అనే నిబంధనతోనే బస్ ఏర్పాటు చేశామని.., ఇలా 60 మందిని బస్సులో ఎక్కించుకుంటారని అనుకోలేదని వివరణ ఇచ్చారు. దీంతో.., బస్సుని సీజ్ చేశారు పోలీసులు. ఇక బస్ లో ఉన్న 60 మంది బంధువులకి మాత్రం పోలీసులు కౌన్సలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. కాగా తెలంగాణలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా కేవలం 3,527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏదేమైనా.. తప్పు ఎవరు చేసినా తప్పే అని నిరూపిస్తూ.., ఆర్టీసీ బస్ ని సీజ్ చేసిన పోలీసులపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.