ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరపాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు కుప్పలు తెప్పలుగా బ్యాంకులు పుట్టుకొస్తున్నాయి. కార్పొరేట్ బ్యాంకుల నుండి గ్రామీణ, సహకార బ్యాంకుల వరకు ప్రజలకు సేవలందించేవే.
ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరపాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు కుప్పలు తెప్పలుగా బ్యాంకులు పుట్టుకొస్తున్నాయి. కార్పొరేట్ బ్యాంకుల నుండి గ్రామీణ, సహకార బ్యాంకుల వరకు ప్రజలకు సేవలందించేవే. అయితే ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకులు మోసాలకు పాల్పడుతున్నాయి. వీటిపై ప్రజల నుండి ఫిర్యాదు రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రంగంలోకి దిగి.. అటువంటి బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవల కాలంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కొన్ని బ్యాంకులకు లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా.. వాటికి ఫైన్ విధించిన సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా మరో నాలుగు బ్యాంకులకు షాక్ ఇచ్చింది.
నిబంధనలను ఉల్లంఘించిన నాలుగు కోపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ కన్నెర్ర చేసింది. మానిటరీ పెనాల్టీని విధించింది. ఇంతకు ఆ బ్యాంకులు ఏంటంటే.. శ్రీ వినాయక్ సహకారి బ్యాంక్, శ్రీజీ భాటియా కోపరేటివ్ బ్యాంక్, మిజోరాం అర్బన్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ బ్యాంక్, విటా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు. వీటిలో విటా, వినాయక్ బ్యాంకులకు రూ. 1.50 లక్షలు, శ్రీజీ లక్ష రూపాయలు, మిజోరాం బ్యాంకుకు రూ. 20 వేల జరిమానా వేసింది. మిజోరం అర్బన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సూపర్ వైజరీ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ SAF కింద జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను ఉల్లంఘించి, 100 శాతం కంటే ఎక్కువ రిస్కుకు కారణమయ్యే రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసినందుకు మిజోరాం బ్యాంకుకు పెనాల్టీ విధించింది.
అలాగే ఖాతాల రిస్క్ కేటగిరైజేషన్ సమీక్ష వ్యవస్థను అమలు చేయడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఇంటర్ బ్యాంక్ (కౌంటర్పార్టీ) ఎక్స్పోజర్ లిమిట్ నిబంధనల్ని మీరిన నేపథ్యంలో శ్రీ వినాయక్ బ్యాంకుపై చర్యలు తీసుకుంది. ఇప్పుడు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కొన్ని బ్యాంకులపై జరిమానాలను విధిస్తుంది. అటువంటి బ్యాంకులపై నిఘాను పెంచుతోంది కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ. అటువంటి బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు జరపడంపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. కాబట్టి సహకార బ్యాంకుల్లో డబ్బు దాచుకునే సమయంలో అన్నీ పరీక్షించి, పరిశీలించి డబ్బులు దాచుకోవడం మంచిది.