హైదరాబాద్- ఆర్కే.. అలియాస్ అక్కిరాజు హరగోపాల్.. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్ట్ అగ్రనేత. గుంటూరు జిల్లాలో ఎక్కడో మారు మూల గ్రామంలో జన్మించిన ఆర్కే.. నక్సల్స్ భావ జాలానికి ఆకర్షితుడై అడవిబాట పట్టాడు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్ట్ అగ్రనేత అయ్యాడు. ఐతే కరోనా సమయంలో ఆర్కే తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అదిగో అప్పటి నుంచి చావుతో పోరాడి ఇటీవల మరణించాడు.
ఇటువంటి సమయంలో హైదరాబాద్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల సోదాలు కలకలం రేపుతున్నాయి. అంబర్ పేట్ ప్రాంతంలోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో నిషేధిత మావోయిస్టు సాహిత్యం ముద్రిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక్కడ ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే జీవిత చరిత్ర ముద్రిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సాయుధ శాంతి స్వప్నం పేరుతో ముద్రించిన ఆర్కే జీవిత చరిత్ర పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు వెయ్యికి పైగా పుస్తకాలతో పాటు, బైండింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న మెటీరియల్ ని కూడా సీజ్ చేశారు పోలీసులు. పుస్తకాలలో మావోయిస్టు పార్టీ భావజాలాన్ని ప్రేరేపించేలా సాహిత్యం ఉందని ఏసీపీ వెంకటరమణ చెప్పారు. ఆర్కే జీవిత చరిత్ర పుస్తకాలు సహా మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
ఈ ప్రింటింగ్ ప్రెస్ పీవోడబ్ల్యూ సభ్యురాలు సంధ్య భర్త రామకృష్ణారెడ్డిదిగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రామకృష్ణారెడ్డి మావోయిస్టు అనుబంధ సంఘాలకు సహాయం చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన ఆర్కే జీవిత చరిత్ర పుస్తకాన్ని ముద్రించి పెట్టాలని ఆయన భార్య శిరీష అడిగారని, అందుకే ముద్రించి ఇచ్చేందుకు అంగీకరించినట్లు పీవోడబ్ల్యూ సంధ్య చెప్పారు. ఈస్ట్ జోన్ డీసీసీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అడిషనల్ డీసీపీ మురళీధర్ రావు, మలక్పేట్ ఏసీపీ వెంకటరమణ సోదాలు పర్యవేక్షిస్తున్నారు.