తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వీధి కుక్కల దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే కుక్కులు వారిపై దాడులు చేసి చంపేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో, గ్రామాల్లో వీధి కుక్కల గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనుకు గురి చేస్తున్నాయి.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల బెడద తీవ్రమైపోయిందని.. ఏ క్షణంలో తమపై దాడులు చేస్తాయో అని బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు ప్రజలు. హైదరాబాద్ అంబర్ పేట లో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకొని సీఆర్పీసీ 174 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత కూడా ఎన్నో చోట్ల వీధికుక్కల దాడుల్లో గాయపడటం, చనిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీధి కుక్కల దాడిలో ఓ 13 ఏళ్ల బాలిక చనిపోయింది. ఈ దారుణ ఘటన కరీనంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలో నెల రోజుల క్రితం 13 ఏళ్ల బాలికను వీధి కుక్కలు కరిచాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతిని తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తీసుకు వచ్చారు. చికిత్స పొందుతూ ఆ బాలిక కన్నుమూసింది. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురు కుక్కల దాడిలో చనిపోవడంతో తల్లిదండ్రులకు గుండెకోత మిగిలింది. కూతురు మృతదేహం వద్ద తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. స్థానికులు ఆ తల్లిదండ్రులను ఆవేదన చూసి కన్నీరు పెట్టుకున్నారు.
నాలుగు రోజుల క్రితమే ఖమ్మం జిల్లా పుఠానీ తండాలో బానోత్ భరత్.. వయసు 5 సంవత్సరాలు. తోటి చిన్నారులతో ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారే వీధి కుక్కలు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని.. హైదరాబాద్ కి తరలించాలని వైద్యులు తెలిపారు. చిన్నారిని బస్సులో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమద్యలో చనిపోయాడు.. దాంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంబర్ పేట వీధి కుక్కల దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికప్పుడు హడావుడి చేసినా.. తర్వాత ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రజలు అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం శూన్యంగానే మిగిలిపోతుంది. అధికారులు వీధి కుక్కల విషయంలో సీరియస్ గా వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.