హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రధానంగా భారత్ లో కరోనా అంతకంతకు విస్తరిస్తోంది. కొంత మేర కేసుల సంఖ్య తగ్గినా.. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ మనిషిలోని ఊపిరి తిత్తులపై బాగా ప్రభావం చూపుతోంది. ఊపిరి తిత్తులల్లోకి ప్రవేశించిన వైరస్ రక్తంలోకి ఆక్సీజన్ సరఫరాను అడ్డుకుంటోంది. దీంతో కరోనా రోగులు ఆక్సీజన్ శాతం పడిపోయి చనిపోతున్నారు. అందుకనే కరోనా రోగులంతా ఇప్పుడు ఆక్సీ మీటర్ తో ఎప్పటికప్పుడు ఆక్సీజన్ స్థాయిలను చెక్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో కరోనా సోకి హోం ఐసొలేషన్ లో ఉన్న వారంతా ఆక్సీ మీటర్ కొనుక్కుని ఎప్పటికప్పుడు ఆక్సీజన్ స్థాయిలను పరీక్షించుకుంటున్నారు.
ఐతే పేదవాళ్లు ఆక్సీ మీటర్ కొనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ఆక్సీ మీటర్ ధర కంపెనీని బట్టి 1500 నుంచి రెండు ఐదు వేల రూపాయల వరకు ఉంది. ఐతే ఇకపై కరోనా రోగులు ఆక్సీ మీటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదని చెబుతోంది కేర్ నౌ హెల్త్ కేర్ సంస్థ. ఈ సంస్థ ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ తో శరీరంలోని ఆక్సీజన్ స్థాయిలను పరీక్షించుకునేలా ప్రత్యేకమైన యాప్ ను రూపొందించింది. కోల్ కత్తాకు చెందిన ఈ సంస్థ తయారు చేసిన కేర్ పిక్సల్ వైటల్స్ యాప్ ను స్మార్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఫోటో ప్లెధిస్మోగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేధ సాయంతో ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాక మన ఫోన్ లోని ఫ్లాష్ ద్వార మనలోని ఆక్సీజన్ స్థాయిలను పరీక్షించుకోవచ్చు. ఆక్సీ మీటర్ లో ఉండే ఇన్ ఫ్రారెడ్ లైట్ సెన్సార్లకు బదులు ఫోన్ లోని ఫ్లాష్ లైట్ సెన్సార్ గా పనిచేస్తుందన్నమాట.
ఫోన్ లో ఈ యాప్ ను ఓపెన్ చేసి, ఫ్లాష్ లైట్ కు మన వేలిని ఈనించి ఉంచి, యాప్ లోని స్కాన్ అనే బటన్ ను క్లిక్ చేయాలి. నలభై సెకన్లలో మన శరీరంలోని ఆక్సీజన్ స్థాయితో పాటు, పల్స్, శ్వాస క్రియ రేట్ ను ఈ యాప్ చెప్పేస్తుంది. ఈ యేడాది మొదట్లోనే ఈ యాప్ ద్వార క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని కేర్ నౌ హెల్త్ కేర్ సంస్థ తెలిపింది. 96 శాతం మేర ఈ యాప్ మనిషి శరీరంరోని ఆక్సీజన్ స్థాయిలను చూపిస్తుందని స్పష్టం చేశారు. ఇక మన ఆక్సీజన్ స్థాయిలను యాప్ నుంచి పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ కూడా చేసుకునే సదుపాయం ఉంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే కేర్ పిక్సల్ వైటల్స్ యాప్ ను మీ పోన్ లో డౌన్ లోడ్ చేసుకుని ఆక్సీజన్ లెవల్స్ ను చెక్ చేసుకొండి.