ఖమ్మం- విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భారీ విగ్రహం ఖమ్మంలో కొలువుదీరుతోంది. పట్టణంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ కృష్ణావతార రూప విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని 2 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిజామాబాద్లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లకారం చెరువు మధ్యలో తీగల వంతెన వద్ద ఏర్పాటుకు సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి.
ఎన్టీఆర్ విగ్రహాన్ని మరింత ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు చుట్టూ సుందరీకరణ ఏర్పాట్లు చేయాలని ఆయన అభిమానులు నిర్ణయించారు. ఈ విగ్రహాన్ని మే 28న ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ విగ్రహం తయారీ పనులు తుదిదశకు చేరినట్లు నిర్వహకులు చెప్పారు.