ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పలు ప్రధాన కట్టడాలకు ప్రముఖుల పేర్లు మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని యమునా ఎక్స్ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని జెవార్ లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ సందర్భంగానే యుమునా ఎక్స్ప్రెస్ వే పేరును మారుస్తూ ప్రకటన చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. విమానాశ్రయ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ప్రెస్ వే పేరును మారుస్తూ అధికారికంగా ప్రకటన చేయనున్నట్టు బిజెపి సీనియర్ నేత ఒకరు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, యమునా ఎక్స్ ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయం అనేది గొప్ప గౌరవం అని అభిమానులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎనిమిది కార్యాచరణ విమానాశ్రయాలు ఉండగా, 13 విమానాశ్రయాలు మరియు ఏడు ఎయిర్స్ట్రిప్లు అభివృద్ధి చేయబడుతున్నాయి.