హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో వంట గదిలో జరిగే ఘటనలు ఒక్కోసారి ఎంతో ఆశ్చర్యానికి, కొన్నిసార్లు ఆగ్రహానికి గురి చేస్తుంటాయి. గతంలో సాంబర్ లో బల్లి, చెడిపోయిన కోడిగుడ్లు, అన్నంలో పురుగులు- రాళ్లు, కుళ్లి పోయిన కూరగాయలు ఇలా ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి. ఈ ఘటన మాత్రం అన్నింటికంటే మహా ఘోరంగా ఉంది. ఉప్మాతో ఏకంగా పాము పిల్లనే వండేశారు. ఆ పని వల్ల 58 మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా అబ్బెతుమకూరు గురుకుల పాఠశాలలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అబ్బెతుమకూరు రెసిడెన్షిల్ పాఠశాలలో ఉదయాన్నే ఉప్మా తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 58 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రిలో వైద్యులు ఉదయం తిన్న ఉప్మా శాంపిల్స్ తీసుకురావాలని కోరారు. అప్పుడు మిగిలిన ఉప్మాను పరీక్షించగా అందులో ఒక పాము పిల్ల కనిపించింది. ఉప్మాతో పాటు పాము కూడా ఉడికిపోయి కనిపిచింది. అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.