ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఆ హామీపై రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధప్రప్రదేశ్ను విభజించి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2014 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్నది. తర్వాత మళ్లీ మాట మార్చింది. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రత్యేక హోదా కోసం పొరాటం చేస్తామని ప్రకటించింది.
తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి.. తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నామని.. కానీ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని స్పష్టం చేసిందని తెలిపింది. తాజాగా భువనేశ్వర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కల్పన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారని.. కానీ ఆర్థిక సంఘం మాత్రం ఎవరికీ వద్దని చెప్పిందన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు.
అలానే తాజాగా ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ కేటాయింపుల్లోమహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి తక్కువ నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై వస్తోన్న విమర్శలపై నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ పథకానికి నిధుల కేటాయింపులు తగ్గలేదని.. ఈ పథకం డిమాండ్ ఆధారితమైంది కాబట్టే నిధుల కేటాయింపులు పెంచుతూ చివరలో సవరణలు చేస్తున్నాము అని తెలిపారు. బడ్జెట్లో నిధులు కేటాయించడం ఒక విధామని.. క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించి డిమాండ్కు అనుగుణంగా సవరించడం మరో విధానమని తెలిపారు. మరి ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.