తాజాగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. జాబిల్లి వైపు తన ప్రయాణాన్ని సాగిస్తూ దూసుకెళ్తుంది. కాగా చంద్రుడిపై ల్యాండర్ ను ఆ తేదీల్లోనే ఎందుకు ల్యాండ్ చేయాలి? అలా చేయకపోతే జరిగే నష్టం ఏంటి? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
భారత అంతరిక్ష రంగం మరో మైలురాయిని అందుకుంది. అంతరిక్ష ప్రయోగాలతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నది. తాజాగా చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరి కోట నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు. ఎల్వీఎం ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరింది. దీంతో దేశ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా చాటిచెప్తున్న ఇస్రోపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చంద్రయాన్ ల్యాండర్, రోవర్ ను ఆ రోజుల్లోనే చంద్రుడిపై ఎందుకు ల్యాండ్ చేయాలి? లేట్ అయితే వచ్చే సమస్యలేంటి? అనే ప్రశ్నలు ప్రతిఒక్కిరిని ఆలోచింపజేస్తున్నాయి. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
చంద్రయాన్-3 జాబిల్లిని చేరడానికి 40 రోజులు ప్రయాణించనుంది. భూ కక్ష్యలో 24 రోజుల పాటు భ్రమణం చెంది, ఆ తరువాత చంద్రునివైపు పయనించి చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ అవనుంది. ఆగస్ట్ 23న లేదా 24వ తేదీన ల్యాండర్ ను ల్యాండ్ చేసేందుకు ఇస్రో నిర్ణయించింది. ఆ తేదీలనే ఎందుకు ఎంచుకుందంటే.. భూమిపై పగలు రాత్రి కలిపి 24 గంటలు కానీ చంద్రుడిపై పగలు అంటే భూమిపై 14 రోజులకు సమానం. ఈ క్రమంలో చంద్రుడిపై ఆగస్టు 23న పగలు మొదలవుతోంది. ఆ టైమ్ లో 14 రోజుల పాటు చంద్రుడిపై సూర్యరశ్మి ఉంటుంది కాబట్టి ల్యాండర్, రోవర్ కు కావాల్సిన సౌరశక్తి లభిస్తుంది. కాబట్టి చంద్రయాన్-3 ప్రయోగం ఫలవంతం అవ్వడానికి అదే సరైన సమయం అని ఇస్రో భావిస్తోంది.
దానికి అనుగుణంగానే ఆ తేదీల్లో చంద్రయాన్ ల్యాండర్, రోవర్ ను సాఫ్ట్ ల్యాండ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. చంద్రుడిపై పరిశోధనలు చేసే ల్యాండర్, రోవర్ కు విద్యుత్ కావాలి. ఆ విద్యుత్ ను వాటిపై అమర్చిన సోలార్ ప్లేట్స్ నుంచి సూర్యరశ్మి సాయంతో విద్యుత్ ను పొందుతాయి. చంద్రుడిపై చీకటి ఉన్న సమయంలో ల్యాండ్ చేసినట్లైతే ల్యాండర్, రోవర్ పనిచేయక పరిశోధనకు వీలు లేకుండా పోతుంది. ఈ కారణంగానే ల్యాండింగ్ కు పరిస్థితుల అనుకూలతను బట్టి ఆగస్టు 23 లేదా 24 న ల్యాండ్ చేయాలని ఇస్రో భావిస్తోంది. ఒకవేళ అప్పుడు కూడా రోవర్ ను ల్యాండ్ చేసే పరిస్థితి లేకపోతే జాబిల్లిపై మళ్లీ పగలు మొదలయ్యే రోజు అంటే సెప్టెంబర్ 23 వరకు వేచి చూడాల్సి ఉంటుందని ఇస్రో వెల్లడించింది.