భారతదేశంలోని ప్రముఖ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తూ… అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. వీడియో పాఠాల ద్వారా విద్యార్ధులకు సబ్జెక్ట్ లకు సంబంధించిన కంటెంట్ ను బైజూస్ సంస్థ అందిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఆ సంస్థపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా జైజూస్ పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ అక్రమాల పుట్టగా మారి.. చిన్నారులను, వారి తల్లిదండ్రులను వేధిస్తుందంటూ ఎన్సీపీసీఆర్ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే బైజూస్ సంస్థ సీఈవో రవీంద్రన్కు కమిషన్ సమన్లు జారీ చేసింది.
బైజూస్ సంస్థపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రస్థాయిల విరుచకపడింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను బైజూస్ సంస్థ కొనుగోలు చేస్తోందని, ఇది పౌరులు వ్యక్తిగత గోప్యతకు భంగ కలిగించడమేనని కమిషన్ తెలిపింది. అంతేకాక తాము బైజూస్ ను నమ్మి మోసపోయామంటూ వేలాది మంది తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారని ఎన్సీపీసీఆర్ పేర్కొంది. బైజూస్ సంస్థకు సమన్లు జారీ చేసే సమయంలో కమిషన్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఫోన్ నంబర్లను బైజూస్ సంస్థ ఏ విధంగా కొనుగోలు చేస్తుందో తమ దృష్టి వచ్చిందని కమిషన్ తెలిపింది. వారి కోర్సులు కొనకపోతే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందంటూ బెదిరించిన విషయం కూడా తెలిసిందని, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని బైజూస్ ఇలా చేస్తే ఊరుకోమని, కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని ఎన్సీపీసీఆర్ ఛైర్ పర్సన్ ప్రియాంక్ కనూంగో తెలిపారు.
డిసెంబర్ 23న తమ ముందు హాజరై.. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని బైజూస్ సీఈవో రవీంద్రన్ కు సమన్లు పంపినట్లు ఆమె తెలిపారు. బైజూస్ కు సంబంధించిన మార్కెటింగ్ టీమ్ విద్యార్ధుల తల్లిదండ్రులను ఆకర్షించేలా కోర్సుల అమ్మకాల్లో అవినీతికి పాల్పడుతున్న విషయంపై అనేక కథనాలు వచ్చాయని, విద్యార్థుల తల్లిదండ్రులన నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని, వాటి ఆధారంగానే తాము విచారణ చేపడుతున్నట్లు ప్రియాంక్ తెలిపారు. బైజూస్ కోర్సులు కొనుగోలు చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోస పోయామని మీడియాకు వివరించిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇంకా పిల్లల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు బైజూస్ మరో అక్రమమార్గం కూడా ఎంచుకుందని కమిషన్ వెల్లడించింది. కోర్సులు కొనుగోలు చేసేందుకు రుణ ఒప్పందాలు చేసుకుందని ఆమె అన్నారు.
బైజూస్ పై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ వెల్లడించింది. అయితే కమిషన్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై బైజూస్ సంస్థ స్పందించింది. విద్యార్థుల సమాచారాన్ని కొనుగోలు చేస్తున్నామని, వినియోదారులను బెదిరిస్తున్నామన్న ఎన్సీపీసీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదని సదరు సంస్థ తెలిపింది. తాము ఎలాంటి సమాచారాన్ని కొనుగోలు చేయడం లేదని పేర్కొంది. వారి స్పందన అలా ఉంచితే.. ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలు ఒక ఎత్తు అయితే.. తాజాగా జాతీయ స్థాయి కమిషన్ నే ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరీ.. బైజూస్ సంస్థపై ఎన్సీపీసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.