అకస్మిక తనిఖీల పేరుతో డిప్యూటీ కలెక్టర్ బాలికల వసతి గృహంలోకి వచ్చి.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆడవారిపై అకృత్యాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. చిన్న పిల్లలని కూడా కనికర్ం లేకుండా లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడవారు కనబడితే చాలు వెకిలి చేష్టలు, అసభ్య ప్రవర్తనలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఓ చోట ఆడవారు అకృత్యాలకు బలవుతున్నారు. వరుసలు, చిన్న, పెద్ద తేడా లేకుండా మానవ మృగాల పైశాచికత్వానికి బలవుతున్నారు. అలాంటిదే మధ్యప్రదేశ్లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఉన్నత పదవిలో ఉండికూడా తన వక్రబుద్ది చూపించుకున్నాడు. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తించి తన హోదాను పోగొట్టుకున్నాడు. చివరకు సస్పెండ్ అయినాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని ఝూవువా జిల్లాలో దారుణం నెలకొంది. డిప్యూటీ కలెక్టర్ సునీల్ యాదవ్ ఝూ(56) ఆదివారం గిరిజన బాలికల హాస్టల్ లో తనిఖీలు చేపట్టారు. ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ప్రిన్సిపల్ ను బయటే ఉండమని బాలికలను గది లోపలికి తీసుకు వెళ్లినాడు. వసతి గృహంలోని అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీశాడు. తర్వాత బాలికల మంచంపై కూర్చొని వారిపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు.
ఇంకా విద్యార్థినులు ఇబ్బంది పడేలా మాట్లాడాడు.
తర్వాత జరిగిన విషయాలను బాలికలు తమ అధ్యాపకులకు వివరించారు. అధ్యాపకులు ఆ ఉన్నతాధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 నుంచి 13 ఏళ్ల వయసున్న విద్యార్థినులతో డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీల పేరుతో చేసిన నిర్వాకాన్ని పోలీసులకు తెలిపారు. అధ్యాపకుల ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా నిందితుడిని విధుల నుండి సస్పెండ్ చేశారు. పోలీసులు సునీల్ యాదవ్ ను స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచి, జుడిషియల్ కస్టడీకి తరలించారు.