ఫిల్మ్ డెస్క్- ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సినిమా టిక్కెట్ ధరలపై వివాదం చలరేగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి మొదలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు.. సినిమా ప్రముఖులకు మధ్య టికెట్ రేట్లపై వాగ్వాదం జరుగుతోంది. ఆఖరికి వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం ఏపీలో సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడం ఆసక్తికరంగా మారింది.
ఇదిగో ఇటువంటి సమయంలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సినిమా టికెట్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు టికెట్ ధరలతో తనకేం సబందం అన్నట్లు నాగార్జున మాట్లాడటం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వర్గాల్లోఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నాగార్జున తాజా సినిమా బంగార్రాజు జనవరి 14న థియేటర్స్లో విడుదలవుతోంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో టికెట్ల ఇష్యూపై నాగార్జునను జర్నలిస్టులు ప్రశ్నలు అడగ్గా, సినిమా స్టేజ్పై పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు.. నేను మాట్లాడను.. అని అన్నారు. టికెట్ రేట్లు మీకు ఇబ్బంది కాదా, కమర్షియల్గా ఏపీలో ఉన్న టికెట్ రేట్లు వల్ల మీకు ఇబ్బంది లేదా.. అని మరో విలేకరి ప్రశ్నించాడు.
దీనికి స్పందించిన నాగార్జున.. నాకేం ఇబ్బంది లేదు.. టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే.. కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి.. నా సినిమాకి అయితే అలాంటి ఇబ్బంది లేదు.. ఓపెన్ గా చెప్పారు. టాలీవుడ్ లోని నిర్మాతలు, హీరోలంతా టిక్కెట్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. నాగార్జున మాత్రం నాకేం ఇబ్బంది లేదని చెప్పడం, అసలు ఆ అంశం తనకు సంబందం లేదన్నట్లుగా మాట్లాడటంతో సినీ వర్గాల్లో చర్యనీయాంశమవుతోంది.