ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ‘మా’ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మా అధ్యక్ష్య పదవికి చాలా మంది పోటీ పడుతుండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహ రావు ఈ సారి ‘మా’ ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు. దీంతో ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ ఎన్నికల నేపధ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని నటీ నటులంతా గ్రూపులుగా విపోయారు.
ఎవరు ఎవరికి మధ్దతు తెలుపుతారన్నదానిపై అప్పుడే సమీకరణలు మొదలయ్యాయి. దీంతో సినీ పరిశ్రమలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇటువంటి సమయంలో ప్రముఖ నటుడు, నిర్మాత, ‘మా’ మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ కీలక వ్యాఖ్యాలు చేశారు. తాను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పరిస్థితి ఇప్పటిలా లేదని ఆయన అన్నారు. అప్పుడు ఎంతో పద్దతిగా, క్రమశిక్షణతో ఉండేదని గుర్తు చేశారు. అప్పట్లో ‘మా’ మెంబర్స్ కూడా చాలా తక్కువగా ఉండేవారని, ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తినట్టుగా ఎవరికి పడితే వాళ్లకి ‘మా’ సభ్యత్వం ఇస్తున్నారని మురళీ మోహన్ అన్నారు.
అసలు ఎవరు ‘మా’ సభ్యులో, ఎవరు కాదో తెలియకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ లో ప్రస్తుతం సుమారు 1000 మంది సభ్యులు ఉన్నారని మురళీ మోహన్ చెప్పారు. కానీ తాను ‘మా’ అధ్యక్షుడిగా చేసిన సమయంలో కేవలం 500 లోపే సభ్యులు ఉండేవారని గుర్తు చేశారు. ఇక ‘మా’ లో కొన్ని విధానలు మారాలన్న మురళీ మోహన్, ఈ విషయంపై ఈ మధ్యన తాను, చిరంజీ, జయసుధ, మోహన్ బాబు,. కృష్ణం రాజు కలిసి చర్చిస్తాన్నామని చెప్పారు.
ఈసారి ‘మా’ ఎన్నికలు జరక్కుండా, ఏకగ్రీవంగా మా అధ్యక్షుడ్ని ఎంపిక చేసి, మంచి కమిటీని ఏర్పాటు చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. గాడి తప్పిన మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ను సరైన ట్రాక్లో పెట్టాలని తామంతా కృషి చేస్తున్నామని మురళీ మోహన్ చెప్పారు. సాధ్యమైనంత వరకూ ‘మా’ అధ్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నా వారందరిని ఒప్పించి, ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. ఇంకా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కుక్కలు చింపిన విస్తరిలా ‘మా’ ని మార్చకూడదని మురళీ మోహన్ విజ్ఞప్తి చేశారు.