నల్గొండ (క్రైం డెస్క్)- పెండ్లి సంబంధం.. ఒకప్పుడైతే తెలిసిన వాళ్లు మాత్రమే సంబంధాలు చూస్తే పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగం. ఇలా వాట్సాప్ లో ఫోటో పంపి అలా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఇది కొంత వరకు సౌలభ్యంగానే ఉన్నా.. కొన్ని సందర్బాల్లో మిస్ యూజ్ అవుతోంది. కొంత మంది ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసమే నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఓ కిలాడీ లేడీ పెళ్లి సంబంధాల పేరుతో లక్షల రూపాయలు కొల్లగొట్టి పోలీసులకు చిక్కింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ధరణి రెడ్డి అబ్బాయిల ఫోటోలను అమ్మాయిల తల్లిదండ్రులకు నకిలీ పేర్లతో చూపించేది. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ సంబంధం మాట్లాడతానని డబ్బులు దండుకుంటోంది.
తాను ఎవరి ఫోటోలైతే అమ్మాయిల తల్లిదండ్రులకు చూపిస్తుందో వాళ్లను సైతం బెదిరిస్తూ తాను అడిగినంత ఇవ్వకపోతే కేసుల్లో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడుతోంది. ఇలా మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న కిలాడీ లేడీని అరెస్ట్ చేసి ఆమె చేస్తున్న మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఈ కిలాడీ లేడీపై నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేష్ పిర్యాదు చేశాడు. తమను బెదిరించి డబ్బులు తీసుకోవడమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా తాము షేర్ చేసిన తమ ఫోటోలతో ఆడపిల్లల తల్లిదండ్రుల వద్ద సంబంధం కుదిరిస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లుగా తమకు తెలిసిందని ఎస్పీ తెలిపారు.
హైదరాబాద్ కు చెందిన బొమ్మెల వెంకటేష్ కు ఇందు దాసరి పేరుతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని అతనితో వీడియో చాటింగ్ చేసింది. సోదరుడైన బొమ్మెల అనుదీప్ అనే వ్యక్తితో సైతం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకొని వారి ఫోటోలను సేకరించి గత మూడు నెలలుగా తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించింది. ఇలా మొత్తం 11 లక్షల 70 వేలు వసూలు చేసుకొని తప్పించుకొని నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో నివాసం ఉంటునట్లుగా గుర్తించిన పోలీసులు యువతిని అరెస్ట్ చేశారు.