ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (89) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో శనివారం ఉదయం రోశయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. కానీ.., మార్గ మధ్యలోని అనుకోని నష్టం జరిగిపోయింది. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు రాజకీయాలలో తిరుగులేని నేతగా సత్తా చాటుకున్న రోశయ్య మరణం అందరిని తీవ్ర వేదనకి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో రోశయ్య జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం.
కొణజేటి రోశయ్య.. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులు ఈయన తల్లిదండ్రులు.రోశయ్య వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడు. తరువాత 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యాడు. రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు కావడం విశేషం. ఇక ఆంధ్ర ఉద్యమంతో రోశయ్య రాజకీయ జీవితం ప్రారంభమైంది. తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ రోశయ్యని ఆకర్షించింది. రోశయ్య 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా కాంగ్రెస్ నుండి ఎన్నికయ్యారు. ఇక తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పని చేశారు. ఇక తరువాత కాలంలో అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించిన అనుభవం రోశయ్య సొంతం.
2004 సాధారణ ఎన్నికల్లో లో చీరాల అసెంబ్లీ నుండి నియోజకవర్గం నుంచి ఎన్నికైన రోశయ్య 2009 లో ఎన్నికలకి ముందుగానే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఈ సుదీర్ఘ కాలంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో ఆర్థిక శాఖా మంత్రిగా రాష్ట్రానికి రోశయ్య అందించిన సేవలు మరచిపోలేనివి. రోశయ్య మొత్తం 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టి ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ సొంతం చేసుకున్నారు.
ఈ సమయంలోనే ఆయన వైఎస్సార్ కి పార్టీలో కొండంత అండగా ఉంటూ వచ్చారు. కానీ.., వైఎస్సార్ హఠాన్మరణంతో రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఏపీకి వరదలు రావడం, రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉగ్ర రూపం దాల్చడం, మరోవైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం రోశయ్యని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తన రాజకీయ జీవితంలో రోశయ్య ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట దశ ఇదే. తరువాత కాలంలో రోశయ్య సీఎం పదవికి రాజీనామా చేసి, తెలుగు రాజకీయాలకి దూరంగా వెళ్లిపోయారు.
ఇక 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేసి, 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ఇలా 6 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తన మీద ఒక అవినీతి మరక కూడా పడకుండా రోశయ్య జాగ్రత్త పడ్డారు. బతికినంత కాలం హుందా రాజకీయాలు చేసి.. రోశయ్య అందరికీ అజాత శత్రువుగా నిలిచారు. మరి.. రోశయ్య పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.