ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఇష్టపడ్డారు. ఇక వేరువేరుగా ఉండలేమని అర్థమయ్యింది. పెళ్లి చేసుకోవాలని భావించారు. మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచి ప్రేమను గెలిపించుకున్నారు. ఈ దంపతులను చూసిన వారు ఎవరైనా సరే.. ఎంత చూడముచ్చటైన జంట అనాల్సిందే. కొన్ని రోజుల పాటు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలసి ఉన్నారు. సజావుగా సాగిపోతుండేది వీరి కాపురం. ఇంతలో ఏమైందో తెలియదు కానీ.. ప్రాణంగా ప్రేమించి.. పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
ఇది కూడా చుడండి : అత్త సూటిపోటి మాటలు తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య
ఆ వివరాలు.. స్థానికంగా నివాసముండే పావని, సాయికుమార్ లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. గత నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురి పెద్దలు కూడా ఇష్టపడి చేసుకున్నారుగా.. అంతా సజావుగా ఉంటుందిలే అని భావించారు. కానీ ప్రాణంగా ప్రేమించిన తన భార్య పావనిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు సాయికుమార్. భార్య పావని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం పావనిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన తరువాత భర్త సాయికుమార్ పరారయ్యాడు. ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం పోతవరంలోఈ ఘటన చోటు చేసుకుంది.
వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. భర్త వేధిస్తున్నాడంటూ పావని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త సాయికుమార్.. అత్తగారింటికి వెళ్లి.. అక్కడ ఉన్న భార్య పావనిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లయి నెలకూడా తిరక్కుండానే ఈ దారుణం చోటుచేసుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవకు మరేదైన కారణం ఉందేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సాయి కుమార్ కోసం గాలిస్తున్నారు పొలిసులు.