ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు పేరు చెబితే భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వాళ్లు ఒక్కసారే హార్ట్ ఎటాక్ కి గురై ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి చేర్చేలోగా కన్నుమూస్తున్నారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా వరుస గుండెపోటు మరణాలు కలవరం పుట్టిస్తున్నాయి. ఇప్పటికే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో పలువురు గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వారు.. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించే లోపు మార్గమద్యలోనే చనిపోతున్నారు. దీంతో గుండెపోటు పేరు వింటేనే ప్రజలకు వెన్నుల్లో వణుకు పుడుతుంది. తాజాగా గుండెపోటుతో ఎమ్మార్వో కన్నుమూశాడు.. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం విషాదం చోటు చేసుకుంది. కేసముద్రం తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ఫరీద్దున్ అకస్మాత్తుగా గుండెపోటు తో కన్నుమూశారు. నిన్న రాత్రి ప్రభుత్వం తరుపు నుంచి ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందులో పాల్గొని అందరిని పేరు పేరునా పలకరించారు ఫరీద్దున్. ఇఫ్తార్ విందు అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కారు డ్రైవర్ కి ఫోన్ చేసి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. డ్రైవర్ వచ్చి ఫరీద్దున్ ని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కేసముద్రం ఎమ్మార్వో ఫరీద్దున్ కి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలుసుకొని ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. అయితే ట్రీట్ మెంట్ జరుగుతున్న సమయంలోనే ఆయన పరిస్థితి విషయమించి కన్నుమూశారు. ఎమ్మార్వో ఫరీద్దున్ మృతిపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన ఎంతో ఆరోగ్యంగా కనిపించారని.. అందరికే స్వయంగా వడ్డించారని.. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా కన్నుమూయడం ఎంతో బాధకలిగిస్తుందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఫరీద్దున్ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.