పొలిటికల్ డెస్క్- హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాదీనం చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీడీపీ పార్టీకి సమైఖ్య రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు బంజారాహిల్స్ లో భూమిని లీజుకు ఇచ్చారు. ఆ స్థలంలో టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను నిర్మించారు. ఐతే ఇప్పుడు తెలంగాణలో పెద్దగా టీడీపీ పార్టీ కార్యకలాపాలు లేకపోవడం, 30 ఏళ్ల లీజు సమయం అయిపోవడంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాదీనం చేసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేసే తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాశారు. టీడీపీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను స్వాధీనం చేసుకోవాలని వారు లేఖలో కోరారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ను స్వాధీనం చేసుకోవాలని కార్యాలయ ఉద్యోగులే స్వయంగా సీఎంకు లేఖ రాయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
టీడీపీ రాష్ట్ర కార్యాలయం లీజు ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి తీసుకున్న ఈ భవన్లో లీజు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని లేఖలో ఉద్యోగులు ఆరోపించారు. ఓ ప్రైవేట్ కాల్ సెంటర్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోని కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చారని వారు సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆంధ్ర పెత్తనం ఎక్కువైపోయిందని, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట కూడా అక్కడ చెల్లుబాటు కావడం లేదని వారు లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణ టీడీపీ కార్యాలయం అయినప్పటికీ, భవన్ అంతా ఏపీ ట్రస్టు ఉద్యోగుల చేతుల్లోని ఉందని, తమను వేధిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, ఇప్పుడు ఉద్యోగాల నుంచి తీసివేస్తామని బెదిరిస్తున్నారని కేసీఆర్ కు గోడు వెల్లబోసుకున్నారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందింస్తున్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.