జమైకా చిరుత, పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతాల నుండి డబ్బులు మాయమయ్యాయి. జమైకాలోని ఓ ప్రైవేటు పెట్టుబడి సంస్థల్లోని అతని ఖాతా నుండి 12.7 మిలియన్ డాలర్లను( భారత కరెన్సీలో దాదాపు రూ. 103 కోట్లకు పైచిలుకు) దోచుకున్నారని ఉసేన్ బోల్ట్ న్యాయ వాదులు తెలిపారు. బోల్ట్ ఖాతాలో 12.8 డాలర్లు ఉండగా, ఇప్పుడు 12 వేల డాలర్లను మాత్రమే చూపిస్తుందని అన్నారు. కాగా, ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఈ చేతి వాటాన్ని ప్రదర్శించాడని సమాచారం.
కొన్నేళ్ల కిందట స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎల్) సంస్థలో బోల్డ్ పెట్టుబడి ఖాతా తెరిచాడు. రిటైర్మెంట్, ఇతర సేవింగ్స్ నిమిత్తం అందులో కొంత డబ్బును జమ చేశారు. ఇటీవల ఆయన ఖాతాను పరిశీలించగా కేవలం 12 వేల డాలర్లను చూపించిందని బోల్డ్ న్యాయవాది తెలిపారు. కంపెనీ మోసపూరిత చర్యల వల్ల ఈ డబ్బు మాయమైనట్లు పేర్కొన్నారు. 10 రోజుల్లోగా డబ్బును తిరిగి ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీనిపై స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్పందించింది. ఈ మోసాన్ని ఈ నెల ఆరంభంలోనే గుర్తించామని వెల్లడించింది. ఓ మాజీ ఉద్యోగి మోసపూరిత చర్య వల్ల ఇలా జరిగిందని పేర్కొంది. తమ సంస్థ ఖాతాదారుల్లో అనేక మంది మిలియన్ డాలర్లను కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై దర్యాపు సంస్థకు ఫిర్యాదు చేశామని, విచారణ కొనసాగుతుందని తెలిపింది. తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ ఘటనపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్ స్పందిస్తూ.. ఇది తీవ్రమైన నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సూచించారు.