గత కొన్నిరోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రాజధాని నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదే పరిస్థితి మరో ఐదు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నగరంలోని మలక్పేట, అంబర్పేటఏరియాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. మలక్పేట్లోని ఆయా కాలనీల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ఆదివారం భారీ వర్షాలు పడతాయని వివరించింది. అంతేకాదు, ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఆ అల్పపీడనం వాయుగుండంగా మారొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.