ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలు కాపులను ఆకర్షించటానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు.. ప్రతి పక్షంలో ఉన్న పార్టీ కావచ్చు.. అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లు చాలా కీలకం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా కాపులకు ఎంత ప్రధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బలమైన సామాజిక వర్గం కావటమే కాకుండా.. సంఖ్యా పరంగా కూడా కాపుల శాతం రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అందుకే అన్ని పార్టీలు కాపులను ఆకర్షించటానికి చూస్తూ ఉంటాయి. ఈ మేరకు వారి మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అధికార పార్టీ అయినా సరే.. ప్రతిపక్షంలో ఉండే పార్టీ అయినా సరే కాపుల మద్దతు కోసం చెయ్యని ప్రయత్నాలు ఉండవు. ఇక, ఏపీలో పాగా వేయటానికి చూస్తున్న బీజేపీ కూడా కాపులను మంచి చేసుకునే పనిలో ఉంది. గత కొన్నేళ్లుగా కాపు సమాజిక వర్గానికి చెందిన వారినే పార్టీ అధ్యక్షులుగా నియమిస్తోంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ, ఇప్పుడు సోము వీర్రాజులు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో బీజేపీ కాపులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవర్తనే తార్కాణంగా నిలుస్తోంది.
కాపులకు సంబంధించిన విషయాల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆసక్తి చూపిస్తున్నారు. వారి తరపున రాజ్యసభలో తరచుగా మాట్లాడుతున్నారు. గతంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన విషయంపై రాజ్యసభలో ప్రస్తావన తెచ్చారు. కాపు రిజర్వేషన్లు చట్ట సమ్మతమేనన్న సమాధానాన్ని రాబట్టారు. ఇక, అప్పటినుంచి కాపుల్లో ఆయనకు కొంత గుర్తింపు వచ్చింది. తాజా పరిణామంతో జీవీఎల్ మైలేజ్ కాపుల్లో పెరిగిపోయిందని చెప్పొచ్చు. తాజాగా, రాజ్యసభ సమావేశాల్లో పాల్గొన్న ఆయన సభలో వంగవీటి మోహన రంగా ప్రస్తావన తెచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఓ జిల్లాకు వంగవీటి రంగా పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. విజయవాడ ఎయిర్పోర్టుకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని, వంగవీటి మోహనరంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, జీవీఎల్ నరసింహరావు కారణంగా బీజేపీకి మంచి జరిగే అవకాశం ఉంది. బీజేపీకి కాపుల్లో కొంత మైలేజీ వచ్చే అవకాశం ఉంది. ఇది బీజేపీ ఎత్తు అయినా.. అలా కాకుండా జీవీఎల్ నరసింహరావు ఎత్తు అయినా.. పార్టీకి లాభపడుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే, ఇది వెనువెంటనే జరగదు. కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి, జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో వంగవీటి మోహనరంగా గురించి ప్రస్తావించటంపై.. బీజేపీకి.. ముఖ్యంగా జీవీఎల్కు కాపుల మద్దతు ఉంటుందా? లేదా ? అన్నదానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.