చిత్తూరు- ఈ కాలంలో ఎప్పుడు ఎవరి చేతిలో ఎవరు మోసపోతారో ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగాక మోసం చేసే వారు సైతం పెరిగిపోయారు. ఛాన్స్ దొరికితే చాలు ఎదుటివారిని మోసం చేసే కేటుగాళ్లు సమాజంలో ఎంతో మంది తిరుగుతున్నారు. ఇక ఇలాంటి మోసాలు ఎన్ని వెలుగుచూసినా.. మోసపోయేవాళ్లు మాత్రం మోసపోతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇలాంటి మోసమే వెలుగుచూసింది.
చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామానికి చెందిన భాస్కరరావుకు బంగారుపాళ్యం మండలం నల్లంగాడుకు చెందిన దామోదరం, తవణంపల్లె మండలం సరకల్లుకు చెందిన బొజ్జయ్యతో అప్పటికే పరిచయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని దామోదరం, బొజ్జయ్య చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన శ్రీనివాసులతో కలిసి భాస్కరరావుకు ఓ వజ్రాన్ని 58.60 లక్షలకు అమ్మారు. ఇది మార్కెట్లో రెండు కోట్ల రూపాయల పైనే విలువ చేస్తుందని నమ్మబలికారు.
వాళ్లు చెప్పింది నిజమేనని నమ్మిన భాస్కరరావు 58.60 లక్షలు ఇచ్చి వారి వద్ద నుంచి వజ్రాన్ని కొన్నాడు. నిందితుల్లో శ్రీనివాసులు ప్రధాన సూత్రధారి కావడంతో ఆయన పెద్ద వాటా తీసుకుని, దామోదరం, బొజ్జయ్య కమీషన్ తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత భాస్కరరావు ఆ వజ్రాన్ని విక్రయించేందుకు ఓ నగల వ్యాపారి వద్దకు నెళ్లగా, ఆ వజ్రం నకిలీదని తేలింది.
దీంతో కంగు తిన్న భాస్కరరావు తనకు వజ్రం అమ్మిన వారి దగ్గరకు వెళ్లి డబ్బు తిరిగిచ్చేయాలని కోరాడు. ఇలా పలుమార్లు అడిగినా వారు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు చేసేది లేక కాణిపాకం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు చిత్తూరు పోలీసులు శ్రీనివాసులు, దామోదరం, బొజ్జయ్యను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.