తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఊళ్లకు ఊళ్లు వరద నీటలో మునిగాయి. రహదారి మార్గాలు కొట్టుకుపోతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఊళ్లకు ఊళ్లు వరద నీటలో మునిగాయి. రహదారి మార్గాలు కొట్టుకుపోతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా హైరాబాద్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచనలు చేశారు. కాగా, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తోంది. సంవత్సరం పాటు కురవాల్సిన వర్షాలు.. అతి కొద్ది కాలంలో పడటంతో ప్రాజెక్టుల వద్ద రికార్డు స్థాయిలో నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్టుల వద్ద భారీగా వరద నీరు చేరడంతో భయాందోళనకు గురౌతున్నారు లోతట్టు గ్రామాల ప్రజలు.
తెలంగాణలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. దీంతో నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, 699.500 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. డ్యామ్ పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో దిగువ ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రస్తుతం ఎగువ నుండి ప్రాజెక్టులోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. ఔట్ ఫ్లో 2.5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 18 గేట్లు ఉండగా.. 14 గేట్లు ద్వారానే ఈ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు గేట్లు మొరాయిస్తున్నాయి. వీటికి మరమ్మత్తులు చేయాల్సి ఉంది. దీంతో గేట్ల పై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టును పరిశీలించడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , ఎమ్మెల్యే రేఖా నాయక్, ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లగా.. ఆ పరిస్థితిని చూసి అక్కడ నుండి ఉరుకుల, పురుగులతో కారులో వెళ్లిపోయారు.
కడెం ప్రాజెక్టు వద్ద నీరు పొంగి పొర్లడంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎవ్వరూ ఉండవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కడెం, కన్నాపూర్, దేవుని గూడెం, మున్యాల్, రాపార్ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు ఇలానే కురిస్తూ ఉంటే, ప్రాజెక్టుకు భారీ మొత్తంలో వరద నీరు చేరితే.. ప్రాజెక్టుకు ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కడెం వరదతో దిగువున ఉన్న పాండవపూర్ వంతెన వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వంతెన దెబ్బతినే అవకాశాలున్న నేపథ్యంలో నిర్మల్-మంచిర్యాల మార్గంలో రాకపోకలను నిలిపివేశారు అధికారులు.