పెళ్లి చేసుకున్న భర్త మోసం చేశాడని, ప్రేమించిన ప్రియుడు వదిలేశాడని.. ఇళ్ల ముందు ధర్నా చేసిన ఆడవారిని చాలా మందినే చూసి ఉంటాం. కానీ.. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఓ వింతైన సంఘటన. నా భార్యని నా దగ్గరికి పంపించు మహా ప్రభో అంటూ ఓ భర్త.. తన భార్య రెండో భర్త ఇంటి ముందు ధర్నాకి దిగాడు. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది నిజం. పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లా ఇందుకు వేదిక అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బుర్ద్వాన్లోని రామచంద్రా కాలనీకి చెందిన ఓ యువతీ, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ.., పెళ్లి అయిన కొన్ని నెలలకే ఈ జంట విడిపోయింది. ఆ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య మీద కోపంతో కొన్ని నెలలు భర్త కూడా ఆమెని ఇంటికి తీసుకుని రాలేదు. కానీ.., ఈ మధ్య భార్య కోసం అత్తగారి ఇంటికి వెళ్లాడు. కానీ.., భార్య మాత్రం అతని వెంట రానని తేల్చి చెప్పేసింది. సరేలా కోపం తగ్గాక తానే వస్తుంది అనుకున్న భర్తకి.. ఆమె దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది.
ఆమె తన మొదటి భర్తకి విడాకులు ఇవ్వకుండా, అసలు తెలియకుండా వెంటనే మరో పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి మొదటి భర్త నిర్ఘాంతపోయాడు. దీంతో.., తన భార్య తనకి కావాలంటూ.. రెండు ప్లకార్డులు పట్టుకుని ఆమె రెండో భర్త ఇంటి ముందు ధర్నాకి దిగాడు. ఒక ప్లకార్డు మీద “ఐ లవ్ యూ వెరీ మచ్” అని రాసి ఉండగా, మరో ప్లకార్డుపై తనపై నిందలేసి మరో వ్యక్తితో ఎందుకు వెళ్లిపోయావంటూ భార్యను నిలదీస్తూ రాసి ఉంది.
ఈ ఘటనపై భార్య స్పందించింది. అతను నన్ను హింసించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా విడాకులు కోరుతూ అతనికి చాలాసార్లు నోటీసులు కూడా పంపాను. కానీ.., అతను స్పందించకపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాని భార్య ధీమాగా చెప్పుకొచ్చింది. మరోవైపు తన భార్యని తీసుకుని తప్ప తాను ఇక్కడ నుండి కదలనని భర్త భీష్మించుకుని కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ భార్య భర్తల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.