మహారాష్ట్ర- ఈ మధ్య కాలంలో దొంగ బాబాల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. మంత్ర తంత్రాల పేరుతో బాబాలు జనాలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో తనకు మహిమలు ఉన్నాయని ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడతానని ఓ దొంగ స్వామీ ఒక మహిళ నుంచి 32 లక్షలు కాజేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది.
ధానే జిల్లాలోని కాల్వ ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని, వాటిని తరిమివేసే శక్తి తనకు ఉందని నమ్మించాడు జల్గావ్ జిల్లాకు చెందిన బాబాన్ బాబూరావు పాటిల్ అనే దొంగ బాబా. అయితే బాబా మోసాన్ని గ్రహించలేని ఆ మహిళ 2019 డిసెంబర్ నుంచి నిందితుడుకి పలు మార్లు డబ్బులు ఇస్తూ వచ్చింది. ఈ రకంగా పాటిల్ ఆమె నుంచి మొత్తం 31.60 లక్షలతో పాటు కొన్ని ఖరీదైన వస్తువులను కూడా తీసుకున్నాడు.
బాబాకు ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ తన ఇంట్లో సమస్యలు పరిష్కారం కాకపోయే సరికి ఆ మహిళకు అనుమానం వచ్చింది. బాబాను అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో దొంగ బాబా అసలు స్వరూపం తెలుసుకుని మోసపోయానని గ్రహించిందా మహిళ. ఇక చేసేది లేక సమీప పోలీస్స్టేషన్కి వెళ్లి జరిగినదంతా చెప్పి పాటిల్పై ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడుని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. జల్గావ్ జిల్లాకు చెందిన బాబాన్ బాబూరావు పాటిల్ బాబా ముసుగులో చాలా మందిని మోసం చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి దొంగ బాబాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.