తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. తమ కోరికలను చంపుకుని.. పిల్లల ఎదుగుదలకు అహర్నిశలు పాటు పడతారు. వారి అభివృద్దికి కృషి చేస్తారు. కానీ నూటికి 90 శాతం మంది పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్లాక.. బిజీ లైఫ్ లేదా మరో ఇతర కారణాల కారణంగా
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. తమ కోరికలను చంపుకుని.. పిల్లల ఎదుగుదలకు అహర్నిశలు పాటు పడతారు. వారి అభివృద్దికి కృషి చేస్తారు. కానీ నూటికి 90 శాతం మంది పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్లాక.. బిజీ లైఫ్ లేదా మరో ఇతర కారణాల కారణంగా.. తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తారు. వారి ఇష్టా ఇష్టాలను, ఆశలు, ఆశయాలు, కలలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరు. కానీ వీరిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుమార్తె మాత్రం కాస్త భిన్నం. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే కాదూ.. ఓ గొప్ప కార్యాన్ని చేసి పది మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆ మహిళే జార్ఖండ్ లోని రాంచీకి చెందిన పోర్షియా పుటతుండ.
ఇంతకు తండ్రి కోసం ఆమె ఏం చేసిందనే కదా మీ డౌట్. అయితే ఈ స్ఫూర్తివంతమైన కథను చదవండి. జార్ఖండ్లోని రాంచీలో పుట్టి పెరిగిన పోర్షియా కోల్కతాలో చదువుకుంది. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్షిప్ చేసింది. పలు సంస్థల్లో పనిచేసింది. సీఎన్ఎన్లో న్యూస్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు చేపట్టింది. అయితే ఆ సమయంలో ఆమె తండ్రిని కోల్పోయింది. ఈ విషయం ఆమెను ఎంతో కుంగదీసింది. చివరకు డిప్రెషన్కు లోను కావడంతో.. దాని నుండి బయటపడేందుకు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని భావించింది. అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది స్పితి లోయ. గతంలో అక్కడకు వెళ్లిన సమయంలో ఎంతో అనుభూతికి లోనైంది. ఇప్పుడు తన తండ్రిని కోల్పోయి గమ్యం ఎటో తెలియని పరిస్థితిల్లో ఈ ప్రాంతమే ఆమెకు గుర్తుకు వచ్చింది. అదే తండ్రి ఆశయాలను నెరవేర్చే గమ్య స్థానం అయ్యింది.
పోర్షియా తండ్రికి చిన్న పిల్లలంటే ఎనలేని ఇష్టం. ఆ పిల్లలతో కలిసి నర్సరీ రైమ్స్ పాడటం అంటే చాలా సరదా. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసేవాడు. పేద లేదా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలకు ఏదైనా చేయాలని పరితపించేవారు. అయితే ఆ కలలు నెరవేర్చకుండానే ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన కలలను సాకారానికి కారణమైంది స్పితి లోయ. అక్కడకు వెళ్లి పేద పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు తన తండ్రితో మాట్లాడినట్లే అనిపించింది. కాజా ప్రాంతంలోని ఒక స్థానిక కుటుంబంతో నెలరోజులు గడిపింది. ఆ కుటుంబంలోని పిల్లలకు పాఠాలు చెప్పింది. ఆ సమయంలో వెనుకబడిన ప్రాంతాల్లో చదువుకు దూరమైన అనేక మంది పేద పిల్లలను చూసి చలించిపోయింది. తన తండ్రి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఇదే సరైన సమయం అని తలచి.. తన ప్రణాళిక మొదలు పెట్టింది. 2020లో పోర్షియా తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన తండ్రి ఆశయ సాధన కోసం సేవా మార్గాన్ని ఎంచుకుంది. మళ్లీ స్పితికి వెళ్లింది. తొలి అడుగు భాగంలో ఏం చేయాలో తోచక వీధుల్లో తిరిగేది.
కాజాలో ఓ చెట్టు కింద కూర్చొని ఇంగ్లీషు మాట్లాడటం, రైమ్స్ పాడటం, గీయడం నేర్పించింది. క్రేయాన్స్, వాటర్ కలర్స్ రంగులు వేయడం నేర్పడంతో ఆమె వద్దకు పాఠాలు నేర్చుకునేందుకు వెళ్లేవారు చిన్నారులు . అలా 40 మంది పిల్లలు అయ్యారు. ఆ సమయంలో బోర్డింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలనుకుంది. కొన్ని ప్రాంతాలు తిరిగి.. హిమా చల్ ప్రదేశ్లోని హైయెస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన కొమిక్ అనే గ్రామంలో స్కూల్ పెట్టాలని నిర్ణయించుకుంది. దీని కారణంగా ఇక్కడి పిల్లలు విద్యకు దూరంగా ఉన్నారని తెలిసి.. తన తండ్రి కోరిక నేరేవేర్చేందుకు ప్లానెట్ స్పితి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచిత బోర్డింగ్ పాఠశాలను నడుపుతోంది. టీచర్, కేర్ టేకర్, ఆ నిరుపేదలకు తల్లి అయిన పోర్షియా వారికి ఆహారాన్ని అందిస్తూ, వారి ఎదుగుదలకు తోడ్పాటునందిస్తుంది. ముంబయిని వదిలి ఇక్కడకు రావడం పట్ల చాలా మంది హేళన చేశారని, ఉద్యోగం వదిలేసి వెళ్లడం మూర్ఖురాలిని అని అన్నారని తెలిపారు. కానీ తన తండ్రి ఆశయం కోసం ఈ మార్గం ఎంచుకోవడం తనకెంతో సంతృప్తిని ఇస్తుందని అంటోంది పర్షియా.