కరోనా కష్ట కాలం మానవాళికి చాలా విషయాలను నేర్పించింది. ఇందులో ఆర్ధిక క్రమశిక్షణ కూడా ఒకటి. ప్రతి మనిషికి సేవింగ్స్ అవసరం ఎంతో కూడా కరోనా తెలియచేసింది. అయితే.., సాధారణ ఉద్యోగికి సేవింగ్స్ చేయగల కెపాసిటీ ఉండదు. పీఎఫ్ కింద కట్ అయ్యే అమౌంట్ మాత్రమే వారు తమ సేవింగ్స్ గా భావిస్తూ ఉంటారు. కానీ.., పీఎఫ్ ఖాతాదారులు తమకి అవసరమైన సమయంలో వెంటనే ఆ డబ్బు తీసుకోవడనికి వీలు లేదు. పొరపాటున హాస్పిటలైజ్ అయినా.., అకౌంట్ లో ఉన్న తమ డబ్బు తమకి ఉపయోగపడకుండా పోతోంది. అయితే.., ఈ పాండమిక్ సమయంలో ఖాతాదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త రూల్ ని అమల్లోకి తీసుకొచ్చింది.
ఇకపై మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పీఎఫ్ కస్టమర్లు తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి రూ. 1 లక్ష వరకు అడ్వాన్స్గా విత్ డ్రా చేసుకోవచ్చునని ఈపీఎఫ్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సదుపాయాన్ని పొందేందుకు వారు ఎలాంటి అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. జూన్ 1వ తేదీ 2021, ఈపీఎఫ్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం గంట లొపలే పూర్తి అయ్యి, సమయానికి మీ డబ్బు మీకు అందేలా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించింది.
నిజానికి ఇంతకుముందు కూడా పీఎఫ్ ఖాతాను నుంచి అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ.., అది మెడికల్ బిల్స్ రీయింబర్స్మెంట్ తర్వాత మాత్రమే లభించేది. అంటే హాస్పిటల్ లో చికిత్స తీసుకునే సమయంలో మనమే బిల్స్ చెల్లించుకుని తరువాత దాన్ని క్లెయిమ్ చేసుకోవడం అనమాట. కానీ.., ఇప్పుడు ఆ అవసరం లేకుండా పీఎఫ్ ఖాతాదారులకు ప్రభుత్వం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఈ అడ్వాన్స్ను తీసుకునేందుకు కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. రోగిని చికిత్స కోసం ప్రభుత్వ, ప్రభుత్వ సంబంధిత ఆసుపత్రిలోనే చేర్చాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించవచ్చు. ఇలాంటి సమయంలో మెడికల్ అధికారి రిపోర్ట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి కాని.., అతని కుటుంబ సభ్యులెవరైనా ఆసుపత్రి వివరాలను తెలియజేస్తూ ఓ అప్లికేషన్ను సమర్పిస్తే చాలు.., మెడికల్ అడ్వాన్స్ మంజూరు అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ కి అధికారులు ఎవరైనా గంట కన్నా ఎక్కువ సమయం కోరినా, ఎక్కువ సమయం తీసుకున్నా ప్రభుత్వానికి కంప్లైంట్ చేయవచ్చు.