ప్రపంచం మెచ్చిన గణిత మేధావి డాక్టర్ సీఆర్ రావు (102) కన్ను మూశారు.
ప్రముఖ భారతీయ అమెరికన్ గణిత మేధావి, గణిత శాస్త్రవేత్త డాక్టర్ సీఆర్ రావు (102) కన్ను మూశారు. ప్రపంచ ప్రఖ్యాత సంఖ్యా శాస్త్రవేత్తగా పేరొందిన కల్యంపూడి రాధాకృష్ణారావు.. కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లా హడగలి గ్రామంలో తెలుగు కుటుంబంలో 1920 సెప్టెంబర్ 10న జన్మించారు. బాల్యమంతా ఆంధ్రప్రదేశ్ లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖ జిల్లాల్లో గడిచింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి మ్యాథమెటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, కోల్కతా యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. కింగ్స్ కాలేజీలో డీఎస్సీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేసి కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కేంబ్రిడ్జ్ ఆంథ్రోపోలాజికల్ మ్యూజియంలో పని చేశారు.
ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ని ప్రారంభించారు. హైదరాబాద్ లో సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ లను ఏర్పాటు చేసింది ఈయనే. గణాంక రంగానికే కాకుండా ఆర్థిక, జన్యు, మానవ శాస్త్రం తదితర రంగాలకు కూడా ఆయన సేవలను అందించారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు సీఆర్ రావు. ఈయన ఇప్పటి వరకూ 477 పరిశోధనా పత్రాలను సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 1945లో కోల్కతా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన పరిశోధన పత్రానికి గాను.. స్టాటిస్టిక్స్ లో నోబెల్ బహుమతిగా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ కి ఎంపికయ్యారు.
ఈ ఏడాదే ఈ బహుమతికి ఎంపికవ్వడం విశేషం. ఆధునిక గణిత శాస్త్రంలో సీఆర్ రావు ప్రావీణ్యుడని అంటారు. మల్టీవేరియట్ అనాలసిస్, శాంపిల్ సర్వే థియరీ, బయోమెట్రి వంటి అంశాలపై పని చేశారు. 1968లో ఈయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నుంచి నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అందుకున్నారు. స్టాటిస్టిక్స్ టెక్నిక్ లను అభివృద్ధి చేయడంలో సీఆర్ రావు కీలక పాత్ర పోషించారు. క్రామెర్-రావు ఇనిక్వాలిటీ, రావు-బ్లాక్ వెల్ థియరీ వంటి టెక్నిక్ లను డెవలప్ చేశారు. అలాంటి ప్రపంచం మెచ్చిన తెలుగు గణిత మేధావి కన్నుమూయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతున్ని కోరుకుందాం.