హైదరాబాద్- మొన్న జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో కాస్య పతకాన్ని సాధించిన పీవీ సింధును మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన మన పీవీ సింధును ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలుపుతూ చిరంజీవి ఓ వీడియోను ఇన్స్టాగ్రమ్ వేదికగా షేర్ చేశారు.
రెండు సార్లు వరుసగా ఒలింపిక్స్లో పతకాలు సాధించిన పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు ఆగస్ట్ 20వ తేదీన తమ ఇంటిలో ఘనంగా సత్కరించారు. పీవీ సింధును సత్కరించిన సందర్బంగా చిరంజీవి కుటుంబ సభ్యులందరితో పాటు, అక్కినేని నాగార్జున ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, టి. సుబ్బరామిరెడ్డి, సుహాసిని మణిరత్నం, రాధికా శరత్ కుమార్, రానా దగ్గుబాటి, శర్వానంద్, అజారుద్దీన్, చాముండేశ్వరీనాధ్ తదితరులు పాల్గొన్నారు.
ఒలింపిక్స్ విజేత పీవీ సింధుని సత్కరించుకోవడం తన బిడ్డను సత్కరించుకున్నట్లే ఉందని మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన ప్రేమ చూపించే ఇలాంటి వారికోసం ఇంకా కష్టపడేందుకు ప్రయత్నిస్తానని చిరంజీవి సత్కారం సందర్బంగా పీవీ సింధు అన్నారు. వచ్చే ఒలింపిక్స్ లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేశారు.
టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు సాధించిన కాస్య పతకంతో చిరంజీవి సహా అందరు ఫోటోలకు ఫోజులిచ్చారు. పీవీ సింధును ఆత్మీయంగా పలకరిస్తూనే, ఆమెతో విడివిడిగా అందరు ఫోటోలు దిగారు. వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది. గతంలో రియోలో 2016లో జరిగిన ఒలింపిక్స్లో సింధు రజత పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఒలింపిక్స్లో ఇప్పటి వరకూ రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే రెండు పతకాలు గెలుపొందాడు. ఈ సందర్భంగా సింధుపై ప్రశంసల జల్లు కురిసింది. భారత్కు ఓ పతకం అందించేందుకు ఆమె చేసిన కృషిని ప్రధాన మంత్రితో సహా పలువురు ప్రముఖులు అభినందించారు.