క్రికెట్లో సాధారణంగా ప్రతి ఆటగాడు తన పేరు, నంబర్ ఉన్న జెర్సీతోనే బరిలోకి దిగుతాడు. ఏదో అత్యవసర సందర్భాల్లో తప్ప ఇతరుల జెర్సీలను వేసుకోరు. మరి అలాంటిది.. యాషెస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లందరూ వేరే వాళ్ల జెర్సీలు ఎందుకు వేసుకున్నారో తెలుసా?
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. తన సహచరుడు సంజూ శాంసన్ జెర్సీతో బరిలోకి దిగాడు. దీనిపై సోషల్ మీడియాలో రాద్ధాంతం జరగగా.. సరైన సైజ్ అందుబాటులో లేని కారణంగా సూర్య.. స్నేహితుడి జెర్సీ వేసుకోవాల్సి వచ్చిందని తెలిసింది. రెండు రోజులు తిరగక ముందే అలాంటి సంఘటనే మరోటి వెలుగు చూసింది. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో బాగంగా జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఓ వినూత్న ప్రయోగం చేసింది. మతిమరుపు (అల్జీమర్స్)తో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు ఇంగ్లిష్ ఆటగాళ్లు.. తమ సహచరులతో ఇలా జెర్సీ స్వాపింగ్ చేసుకున్నారు.
ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో జెర్సీ ధరించగా.. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్.. సహచర బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పేరున్న జెర్సీలో దర్శనమిచ్చాడు మోయిన్ అలీ క్రిస్ వోక్స్తో జెర్సీ ఎక్స్చేంజ్ చేజుకున్నాడు. మతిమరుపుతో బాధపడుతున్న వారికి సూచనా ప్రాయంగా ఇలా చేసినట్లు ఇంగ్లండ్ సహాయక కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ వివరించాడు. ‘అల్జిమర్స్ సొసైటీకి అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మా హృదాయాలకు ఎంతో దగ్గరైన అంశం. మతిమరుపు అనేది చాలా ఇబ్బందికర రోగం. దీనిపై మరింత అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే జెర్సీలను మార్చాం. దీని వల్ల మతిమరుపు అంశాన్ని మరింత మందికి చేరువ చేయడంతో పాటు.. ఆ దిశగా రీసెర్చ్ చేస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలువాలనుకుంటున్నాం’ అని ట్రెస్కోథిక్ అన్నాడు.
ఇంగ్లండ్ ఆటగాళ్లు జెర్సీలు మార్చుకోవడం వెనుక కారణం తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో ఈ చర్యను ఆహ్వానిస్తున్నారు. మరోవైపు బజ్బాల్ ఆటతీరునే నమ్ముకొని ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ను కోల్పోయిన ఇంగ్లండ్.. చివరి మ్యాచ్లోనూ అదే తరహా ఆట కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో వన్డే తరహా ఆటతో 283 పరుగులకు ఆలౌటైన ఇంగ్లిష్ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో మరోసారి ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంటోంది. ఓపెనర్లు జాక్ క్రాలీ (76 బంతుల్లో 73; 9 ఫోర్లు), బెన్ డకెట్ (55 బంతుల్లో 42; 7 ఫోర్లు) వేగంగా ఆడటంతో లంచ్ సమయానికి ఆతిథ్య జట్టు వికెట్ కోల్పోయి 130 పరుగులు చేసింది.