కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రజల ప్రాణాలు గాలిలో కలసిపోతూనే ఉన్నాయి. ఈ భయంకరమైన విపత్తు నుండి కనీసం ఈ మాత్రమైనా బయట పడగలిగాము అంటే ఇది వైద్యుల పుణ్యమే అని చెప్పుకోవాలి. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, వృత్రిని దైవంగా భావించి వారు కొన్ని లక్షల మందిని కాపాడారు. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వైద్యో నారాయణో హరి అన్న మాటని నిజం చేసిన గొప్ప డాక్టర్స్ మధ్యలోనే.., ప్రాణాలతో వ్యాపారం చేసే డాక్టర్స్ కూడా కరోనా కాలంలో పుట్టుకొచ్చారు. చావు బతుకుల మధ్య ఆస్పత్రికి వచ్చి.., కాపాడండి మహానుభావ అని శరణు అడిగిన పేషంట్స్ కి పదుల లక్షల్లో బిల్ వేసి వైద్య వృత్తికే కళంకం తీసుకొచ్చారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి హాస్పిటల్స్ ని గుర్తించి, వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా.., ఇప్పుడు ఇలాంటి ఓ ఆస్పత్రిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓబిలిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తికి కరోనా సోకింది. దీంతో.., కుటుంబ సభ్యులు అతన్ని మే 14 న సాయిసుధా ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల ట్రీట్మెంట్ అనంతరం ఆయన హాపిటల్ లోనే మరణించారు. కానీ.., పేషంట్ చనిపోయాక కూడా.., సాయి సుధా ఆసుపత్రి కోవిడ్ చికిత్సకు డబ్బులు వసూలు చేసిందని బాధితుల కుటుంబసభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.., ఆరోగ్య శ్రీ జిల్లా క్రమశిక్షణా కమిటీ చేకూరి కీర్తి సమక్షంలో విచారణ జరిగింది. ఈ దర్యాప్తులో ఆసుపత్రి యాజమాన్యం గత కొన్ని నెలలుగా తమ ఇష్టం వచ్చినట్టు లక్షలకి లక్షలు ఫీజులు వసూలు చేసినట్టు తేలింది.
ఓబిలిశెట్టి సత్యనారాయణ చనిపోయిన సమయానికి బ్యాలెన్స్ బిల్ రూ.3.16 లక్షలే ఉండగా.., రూ.10.84 లక్షలను ఎందుకు వసూలు చేశారని కమీషన్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. కానీ.., ఆస్పత్రి యాజమాన్యం నుండి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. దీంతో.., అదనంగా తీసుకున్న10 లక్షలకి గాను.., ఏడు రెట్లు.. అనగా రూ.75.780 లక్షల ఆ ఆస్పత్రికి జరిమానా విధించారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఈ నగదుకు సంబంధించిన చెక్కును కలెక్టర్ డీ. మురళీధర్ రెడ్డికి అందించింది. దీంతోపాటు బాధితుల నుంచి వసూలు చేసిన రూ.10.84 లక్షలను కూడా బాధితులకు అందించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ ప్రభత్వం వ్యవహరించిన తీరుకి నెటిజన్స్ తమ మద్దతు తెలియ చేస్తుండటం విశేషం. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.