హైదరాబాద్- కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. మన దేశంలో ఒక్కొక్క కేసు పెరుగుతూ మెల్ల మెల్లగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గురువారం నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గరు విదేశీయులకు, లండన్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.
కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు, ఒకరు పురుషుడు ఉన్నారు. వీరు నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరి నమూనా తీసుకుని పరీక్షించగా కరోనా పాజిటివ్గా తేలింది. జన్యు విశ్లేషణలో ఒమైక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. కాగా ఈ ముగ్గురు నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ లో తిరుగుతున్నారు.
హైదరాబాద్ లో వేర్వేరు హోటళ్లలో బస చేసినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి వీరి వివరాలు, ఆచూకి తెలుసుకుని టిమ్స్కు తరలించినట్లు సమాచారం. లండన్ నుంచి మరో వ్యక్తి యూసూఫ్ గూడకు చెందినవారు. మూడు రోజుల క్రితం ఎయిర్ పోర్ట్ లో పరీక్షించగా పాజిటివ్ రాగా టిమ్స్కు పంపించారు. ఈ నాలుగు కొత్త కేసులతో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల కేసుల సంఖ్య ఆరుకు చేరింది.
ఈ నెల 11న అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుని, అక్కడి నుంచి కుటుంబంతో కోల్కతా వెళ్లిన 7ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో గురువారం 40,103 మందికి కరోనా పరీక్షలు చేయగా 190 మందికి పాజిటివ్గా తేలింది. కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు చనిపోయారు. హైదరాబాద్ లో ఇతరత్రా జబ్బులకు వైద్యం చేయించుకునేందుకు విదేశీయులు తప్పుడు వివరాలతో ఇక్కడికి వస్తున్నారని అధికారులు గుర్తించారు.