ఆ తండ్రి తన చిన్నారి పుత్తడి బొమ్మకు ఆకాశమంత పందిరి వేసి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మడిని ఓ అయ్య చేతిలో పెట్టాడు. తన జీవితంలో ఎంతో పెద్ద బాధ్యతను పూర్తి చేశానని కొండంత ఆనందంతో ఇంటికి బయల్దేరాడు. అత్తవారింట్లో ఉన్న కూతురుకి ‘రెండ్రోజుల్లో వస్తానమ్మా.. ధైర్యంగా ఉండు’ అంటూ మాటిచ్చి వెళ్లాడు. ఆ తండ్రి తన కూతురికి ఇచ్చిన మాటను మర్చిపోయి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ‘నాన్నా నాకిచ్చిన మాట ఏమైంది? రెండ్రోజుల్లో వస్తానన్నావ్.. లే నాన్నా, నాకు నువ్వు కావాలి’ అని ఆ పిచ్చి తల్లి.. తన తండ్రిని నిలదీస్తున్న సన్నివేశం ఆ ఊరి వారందరినీ కన్నీళ్లు పెట్టించింది.
వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు బళ్లారిలో కుమార్తె ప్రశాంతి వివాహం చేసి.. అనంతరం బంధువులతో కలిసి ఇన్నోవా కారులో ఇంటికి బయల్దేరారు. నింబగల్లుకు వస్తుండగా బూదగని వద్ద కారును లారీ ఢీ కొట్టి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అంత్యక్రియల కోసం వెంకటప్పనాయుడు మృతదేహాన్ని స్వగ్రామం నింబగల్లుకు తీసుకొచ్చారు. తండ్రి చివరి చూపుకోసం కర్ణాటక రాష్ట్రం నుంచి నవ వధువు ప్రశాంతి, కుమారుడు సతీష్ నింబగల్లుకు వచ్చారు. ప్రశాంతిని పట్టుకుని దాక్షాయణి ‘ఇంక నీకు నాన్న లేడమ్మా’ అంటూ ఒక్కసారిగా రోదించింది. ఆ తల్లీ కుతూళ్లను ఎలా ఓదార్చాలో అర్థంకాక అందరూ చూస్తుండిపోయారు.
బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామానికి చెందిన సుభద్రమ్మ, తిమ్మప్ప దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. తిమ్మప్ప గతేడాది కొవిడ్ తో మరణించారు. పెద్ద కుమార్తెకు వివాహం జరిగిపోయింది. కుమారుడు సతీష్ జర్మనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. సుభద్రమ్మ చిన్న కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆ ప్రమాదంలో తల్లి, పెద్దమ్మను కోల్పోయిన సతీష్.. వెంటనే ఇండియా బయల్దేరాడు. కానీ, విమానాశ్రయంలో అతనికి కొవిడ్ పాజిటివ్ తేలడంతో అక్కడే ఉండిపోయాడు.
ప్రమాదంలో మృతి చెందిన లత్తవరం గ్రామానికి చెందిన స్వాతి భర్త శ్రీధర్ బాధ వర్ణనాతీతంగా మారింది. భార్య, కవలలతో కలిసి కారెక్కిన శ్రీధర్ ను.. బావమరిది ‘బావా నేను అలిసిపోయా నువ్వు బైక్ వేసుకురా.. నేను కారులో వెళ్తా’ అంటూ కారు దింపేశాడు. ‘నాకు ప్రాణభిక్ష పెట్టి మీరు వెళ్లి పోయారా?’ అంటూ శ్రీధర్ విలపిస్తుంటే.. అక్కడున్న వాళ్ల కళ్లు చెమ్మగిల్లాయి. ఇంక నేను ఎవరికోసం బతకాలంటూ శ్రీధర్ ఆవేదన చెందుతున్నాడు.
ఈ రోడ్డు ప్రమాదం రాయలప్పదొడ్డి, పిల్లలపల్లి గ్రామాల్లో తీవ్ర విషాదం నిపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ ప్రమాదంలో మరణించారు. లచ్చన్న- ఈరమ్మ దంపతులకు సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మ, దాక్షాయణి అని నలుగురు కుమార్తెలు, బసవరాజు అనే కుమారుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మలు కన్ను మూశారు. రెండు నెలల క్రితం బసవరాజు అనారోగ్యంతో మరణించారు.
ఉరవకొండలోని ఎడిసన్ పాఠశాలలో శ్రీధర్- స్వాతి దంపతుల కవలలు జాహ్నవి, జశ్వంత్ చదువుతున్నారు. ప్రమాదంలో వారు ఇద్దరూ మరణించడంతో సోమవారం ఆ పాఠశాలకు సెలవు ఇచ్చారు.
బూదగని వద్ద ఇన్నోవా కారును లారీ ఢీకొట్టిన ఘటన మృతులు: బీజేపీ నేత కోనా వెంకటప్ప(58), బొమ్మనహాళ్ కు చెందన సరస్వతి(60), సరస్వతి కుమారుడు అశోక్(35), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ(48), శివమ్మ(35), సుభద్రమ్మ(58) లత్తవరానికి చెందిన స్వాతి(38), కవలలు జాహ్నవి(12), జశ్వంత్(12). ఈ తీవ్ర విషాద ఘటన మొత్తం జిల్లా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారివారి స్వగ్రామాల్లో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.