తమను పున్నామ నరకం నుండి తప్పించేదీ వాడని మురిసిపోతారు. కుమారుడు పుట్టాలని కోటి దేవుళ్లకు మొక్కుతారు. పుట్టిన కుమారుడ్నిపెంచి, పెద్ద చేసి, ఉన్నత చదువులు చదివిస్తారు. ప్రయోజనకుడిని చేసేందుకు పడరాని పాట్లు పడతాడు
కుమారుడు పుడితే ఇంటికి వారసుడు పుట్టాడని ఆనందంలో మునిగి తేలుతారు తల్లిదండ్రులు. తమను పున్నామ నరకం నుండి తప్పించేదీ వాడని మురిసిపోతారు. కుమారుడు పుట్టాలని కోటి దేవుళ్లకు మొక్కుతారు. పుట్టిన కుమారుడ్నిపెంచి, పెద్ద చేసి, ఉన్నత చదువులు చదివిస్తారు. ప్రయోజనకుడిని చేసేందుకు పడరాని పాట్లు పడతాడు. అతడిని ఓ ఇంటి వాడ్ని చేస్తారు. వృద్ధాప్యంలో తమకు అండగా నిలుస్తాడని, అతడి దగ్గరే జీవితం ముగించాలని భావిస్తుంటారు. అలాంటి కలలే కన్నారు ఆ దంపతులు కూడా. కానీ వారిని ఆదరించాల్సినే కొడుకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. ఈ ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది.
ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులను అన్నీ దగ్గర ఉండి చూసుకోవాల్సిన కొడుకే.. ఆస్తి కోసం వారిపై దౌర్జన్యానికి దిగారు. వారిని ఇంటి నుండి గెంటేశాడు. ఈ ఘటన జడ్చర్ల మండలంలో పెద్ద ఆదిరాల గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ గ్రామానికి చెందిన బీరయ్య, తిర్మలమ్మకు ఇద్దరు కుమారులు. వీరిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. అయితే కుమారులిద్దరూ వృద్ధ దంపతులను పట్టించుకోకుండా వేరే కాపురం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం ఇద్దరు కుమారులకు 5 ఎకరాల చొప్పున భూమి రాసిచ్చేశారు. మిగతా 8 ఎకరాల్లో వృద్ధ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమం లో చిన్న కుమారుడు మల్లేశ్ మిగతా ఆస్తి కూడా తన పేరు రాయాలని తల్లిదండ్రులను వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయంపై రోజూ తాగొచ్చి వారితో గొడవ పెట్టుకున్నాడు.
ఈ విషయంపై తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తాము బతికున్నంత కాలం వ్యవసాయం చేసుకుని బతుకుతామని, తాము చనిపోయాక ఈ ఆస్తులు మీకే చెందుతాయని తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకోలేదు. పెద్ద మనుషులు మందలించినా మల్లేశ్ లో మార్పు రాలేదు. ఓ రోజు మల్లేశ్ ఇంటికి వచ్చి ఆస్తి తన పేరు మీద రాయాలని, అప్పటి వరకు ఇంట్లో ఉండొద్దంటూ వారిని బయటకు గెంటేశాడని తల్లిదండ్రులు భోరుమన్నారు. ఇంటికి తాళం కూడా వేశాడని ఆవేదన చెందారు. తమను కొట్టి చంపుతాడన్న భయంతో ఊరు వదిలి వివిధ గ్రామాల్లోని గుడుల్లో తలదాచుకుంటున్నామని వాపోయారు. కొడుకుతో తమకు ప్రాణహాని ఉందంటూ జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.