కోల్కతా (నేషనల్ డెస్క్)- తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని రాజ్ భవన్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ దీదీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాధారణంగా జరిగింది. మమతా బెనర్జీ బెంగాలీలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు మందు టీఎంసీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశానికి మమత బెనర్జీ హాజరయ్యారు. ఇక కొత్తగా ఎన్నికైన సభ్యులు మే 6 న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 292 సీట్లలో 213 సీట్లను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన టీఎంసీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.
ఇక భారతీయ జనతా పార్టీ 77 స్థానాలను గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్ 17 వ అసెంబ్లీ నాయకురాలిగా మమతా బెనర్జీని ఎన్నుకున్నట్లు టీఎంసీ పార్టీ నుంచి సమాచారం వచ్చిన తరువాత, ఈరోజు ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మమతా బెనర్జీని రాజ్ భవన్కు ఆహ్వానించామని గవర్నర్ ధన్కర్ ట్వీట్ చేశారు. మరోవైపు తృణమూల్ ఎమ్మెల్యేలు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ విమన్ బెనర్జీని కొత్త అసెంబ్లీ యాక్టింగ్ స్పీకర్గా ఎన్నుకున్నారు. ఇక మమత మంత్రివర్గం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.