స్పోర్ట్స్ డెస్క్- ప్రపంచంలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా.. టీవీలకు అతుక్కుపోయి ఆటను తిలకిస్తాం. అదే మన దగ్గరే క్రికెట్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులకు పండగే. ఎంత కష్టమైనా టికెట్స్ సంపాదించి నేరుగా మ్యాచ్ చూసేస్తాం కదా. ఇదంతా ఎందుకంటే ఈ యేడాది అక్టోబర్- నవంబర్ లో టీ-20 ప్రపంచ కప్ జరగబోతోంది కదా.. ఈ నేపధ్యంలో బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్ మొట్టమొదటి సారి హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగబోయే ఈ మెగా టోర్నీని హైదరాబాద్ లో కూడా నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం తొమ్మిది నగరాల్లో టీ-20 ప్రపంచకప్ను నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. అహ్మదాబాద్, హైదరాబాద్ తో పాటు.. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ధర్మశాల, లఖ్నవూలను టీ-20 ప్రపంచ కప్ మ్యాచ్ లకు ఎంపిక చేశారు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం టీ-20 ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనుంది. శుక్రవారం నిర్వహించిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్లో సభ్యులతో బోర్డు కార్యదర్శి జై షా ఈ అంశాలను ప్రస్తావించారు. 2016 లో జరిగిన టీ-20 ప్రపంచ కప్ మ్యాచ్ లు ఏడు వేదికల్లో నిర్వహించగా.. ఈసారి అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, లఖ్నవూలకు కొత్తగా అవకాశం లభించింది. ఐతే టీ-20 ప్రపంచ కప్ వేదికల వివరాలను బీసీసీఐ అందికారికంగా ప్రకటించాల్సి ఉంది.