‘మా’ లో మొదలైన ఎన్నికల రచ్చకి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించడంతో అంతా ఈ రచ్చ అక్కడితో ఆగిపోయింది అనే అనుకున్నారు. కానీ.., ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచిన వారంతా పదవులకి రాజీనామా చేయడం, ఆ తరువాత ఎన్నికలు జరిగిన విధానంపై కూడా ఆరోపణలు చేయడంతో ‘మా’ గొడవ కొనసాగుతూనే వస్తోంది. ఇక ‘మా’ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, మంచు కుటుంబ సభ్యుల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది. ఆ గ్యాప్ అలా కొనసాగుతూనే వస్తోంది.
తాజాగా విష్ణు, పవన్ కళ్యాణ్ అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. దీంతో.., విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోలేదని కథనాలు వెలువడ్డాయి. తాజాగా వీటిని ఖండిస్తూ మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో నేను, పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడుకున్నాము. కానీ.., మేము ఇద్దరం మాట్లాడుకోలేదు అంటూ అందరూ కథనాలు అల్లేస్తున్నారు.
మా నాన్న, చిరంజీవి స్నేహితులు. నేను, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులం. ఆ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాము అంటే మీరు ఎందుకు నమ్మరు? మాకు, మెగా ఫ్యామిలీకి మధ్య ఎప్పటికీ గోడవలు ఉండవంటూ విష్ణు కామెంట్స్ చేయడం విశేషం. నిజానికి మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటే ఆ విజువల్స్ మీడియాలో కనిపించాలి కదా? అవేవి బయటకి రాలేదు. మరి.. కెమెరా కంటికి కూడా కనిపించకుండా వీరిద్దరూ ఎప్పుడు మాట్లాడుకున్నారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మరి.. విష్ణు చెప్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఆయనతో మాట్లాడి ఉంటారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.