కేజీఎఫ్ సినిమాపై విమర్శలు వివాదంలో చిక్కుకున్న వెంకటేష్ మహా ఒక హీరో వల్ల నష్టపోయానంటూ ధర్నాకు దిగారు. వెంకటేష్ మహా ఒక ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. ఇటీవల కేజీఎఫ్ చిత్రంపై విమర్శలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. కేజీఎఫ్ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాపై వెంకటేష్ మహా కామెంట్స్ చేయడంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే వెంకటేష్ మహా మాత్రం తాను చేసిన కామెంట్స్ పై వెనక్కి తగ్గేదెలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈయన ఒక హీరో వల్ల నష్టపోయాను అంటూ ప్లకార్డు పట్టుకుని రోడ్డెక్కారు. ‘నీ సినిమా వల్ల నేనూ నష్టపోయాను. నా నష్టానికి సమాధానం కావాలి’ అంటూ ప్లకార్డు పట్టుకుని ధర్నాకు దిగారు. హీరోల వల్ల నష్టపోయామంటూ దర్శకులు, నిర్మాతలు ధర్నాకు దిగడం మనం చూస్తూ ఉంటాం.
ఈ క్రమంలో ఓ హీరో వల్ల తానూ నష్టపోయానంటూ ధర్నాకు దిగారు వెంకటేష్ మహా. అయితే ఇది నిజ జీవితంలో కాదండోయ్. ఈయన యాంగర్ టేల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ మార్చి 9 నుంచి డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సుహాస్, బిందు మాధవి, వెంకటేష్ మహా, తరుణ్ భాస్కర్ తదితరులు నటించిన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ లో వెంకటేష్ మహా ఓ హీరో అభిమానిగా కనిపిస్తారు. ఆ హీరోకి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నటించారు. అభిమాన హీరో కోసం ఓ ప్రెస్ షో వేయాలని అభిమాని అనుకుంటాడు. అందుకోసం రూ. 70 టికెట్ ను రూ. 1200కు, రూ. 3 వేలకు అమ్మే ప్రయత్నం చేస్తాడు.
కానీ సినిమా ప్లాప్ అవుతుంది. వేరే హీరో ఫ్యాన్స్ దగ్గర పరువు పోయిందని అభిమాని బాధపడతాడు. కట్ చేస్తే హీరో, నిర్మాత, దర్శకుడు కలిసి మరో సినిమా చేస్తుంటారు. అయితే వీళ్ళు బానే ఉన్నారు, అభిమాని అయినందుకు నాకెందుకు ఈ బాధ అని కోపంతో ఊరొదిలి హైదరాబాద్ వెళ్ళిపోతాడు అభిమాని. హైదరాబాద్ లోని సదరు హీరో ఇంటి ముందు తనకు న్యాయం కావాలంటూ ప్లకార్డు పట్టుకుని ధర్నాకు దిగుతాడు. అలా వెంకటేష్ మహా హీరో వల్ల నష్టపోయా అంటూ ప్లకార్డు పట్టుకుని నిలబడతాడు. ఈ సీన్ వెబ్ సిరీస్ లో హైలైట్ గా నిలిచింది. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.