గత కొంత కాలంగా వివాదాల నడుమ.. ప్రేక్షకుల నోళ్లల్లో నానుతున్న సినిమా ఏదైనా ఉందా అంటే? అది దళపతి విజయ్ హీరోగా నటించిన ‘వారసుడు’ మూవీ అనే చెప్తారు అందరు. ఓవైపు థియేటర్ల విషయంలో నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలు, మరో వైపు విజయ్-అజిత్ ఫ్యాన్స్ మధ్య మాటల వార్ మెుదలగు అంశాలతో వారసుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. తమిళంలో ‘వారీసు’, తెలుగులో ‘వారసుడు’ పేరుతో సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు దళపతి విజయ్. తాజాగా జరిగిన ఆడియో వేడుకలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దళపతి విజయ్.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్-రష్మిక మందన్నా జంటగా కలిసి నటించిన చిత్రం ‘వారసుడు’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సంక్రాంతికి బరిలోకి దిగనుంది. ఈ సందర్భంగా తమిళ ఆడియో రిలీజ్ వేడుకను తాజాగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో జానీ మాస్టర్ తో కలిసి చిందేసింది రష్మిక. ఇక ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు దళపతి విజయ్. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ..”మీ అందరికి ఓ విషయం చెప్పాలి. 1990లోనే నాకు పోటీగా ఓ నటుడు వచ్చాడు. కొద్ది రోజులు ఆయనకు నాకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఆయన సక్సెస్ కారణంగా నేను ఇంకా వేగంగా పరిగెత్తాల్సి వచ్చింది. అతడి కంటే ఎక్కువగా విజయం సాధించాలని భావించాను. ఇక ఇలా ప్రతీ ఒక్కరికి పోటీదారుడు ఉండాలి. నాకు 1990ల్లో పోటీ నిలిచిన ఆ నటుడి పేరు జోసెఫ్ విజయ్” అని దళపతి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఇది విజయ్ అసలు పేరు. ఎవరికి వారే పోటీగా భావించి జీవితంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ సూపర్ స్టార్ అవుతాడని అప్పుడే నేను చెప్పానని నటుడు శరత్ కుమార్ ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నాడు. ఈ వేడుక కోసం రష్మిక దుబాయ్ నుంచి వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ తో కలిసి పనిచేయడానికి 27 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నాడు. ఇక నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..”విజయ్ నటుడిగానే కాదు నిజ జీవితంలో కూడా సూపర్ స్టారే. నంబర్ వన్ హీరో విజయ్ అంటూ ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. ఇది రీమేక్ చిత్రం కాదు.. పక్కా తమిళ చిత్రం” అని ఆయన చెప్పారు. తాను చిన్న తనంంలో తన తండ్రితో కలిసి విజయ్ ‘గిల్లీ’ చిత్రాన్ని చూశానని, అప్పటి నుంచి అతడికి వీరాభిమానిగా మారిపోయానని హీరోయిన్ రష్మిక చెప్పుకొచ్చింది. మరోవైపు విజయ్ వారీసు కు పోటీగా అజిత్ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో నిలవనుంది. ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతుందో వేచిచూడాలి.