దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృభిస్తుంది. ఇప్పుడు కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ మద్య ఇండస్ట్రీలో వరుసగా కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్, విక్రమ్, బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, అమృతా అరోరా తో పాటు మరికొంత మంది సెలబ్రెటీలకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది.
తాజాగా ప్రముఖ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. లండన్ లో షూటింగ్ ముగించుకొని వచ్చాక ఆయన ఆరోగ్యం కాస్త అస్వస్థతకు గురైందట. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే ఆయన చెన్నైలోని రామచంద్రా ఆసుపత్రిలో చేరారు. ‘నాయి శేఖర్ రిటర్న్స్’అనే సినిమాకు లోకేషన్ల, ఆర్టిస్టుల ఎంపిక కోసం వడివేలు, డైరెక్టర్ సూరజ్, నిర్మాత లైకా ఉమేశ్ లండన్ వెళ్లారు. అయితే వడివేలు లండన్ నుంచి రావడంతో అధికారులు ఒమిక్రాన్ పరీక్షలు కూడా చేస్తున్నారు. శనివారం నాడు ఒమిక్రాన్ రిపోర్టులు వస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : హీరోయిన్ రష్మిక ఇంట్లో ప్రత్యేక పూజలు! కారణం..?
ఇటీవల కరోనా బారిన పడిన కమలహాసన్ కూడా ఇదే రామచంద్రా ఆసుపత్రిలో అడ్మిట్ అయి కోలుకున్నారు. మరో హీరో విక్రమ్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. వడివేలుకి కరోనా సోకిందనే వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీలో అలజడి రేగింది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.