దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం స్మరిస్తోంది. బాహుబలితో పాన్ వరల్డ్ డైరెక్టర్గా మారిన రాజమౌళి.. ట్రిపులార్తో ఆ స్థానాన్ని మరింత సుస్థిర పరుచుకున్నాడు. ఇటీవలే అమెరికాలో తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియన్ సినిమా గౌరవాన్ని మరింత విస్తృతపరిచారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా టాలీవుడ్ అనే పేరు బాగా వినిపిస్తోంది. ట్రిపులార్ సినిమాకి ప్రపంచంవ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే జపనీస్ లో కూడా ఈ సినిమా విడుదలై టాప్ ఇండియన్ సినిమాగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ట్రిపురాల్ సినిమాకి అంత తేలిగ్గా ఇవన్నీ సాధ్యం కాలేదు. దాని వెనక జక్కన్న ఎంత కష్టపడ్డాడో హీరోయిన్ శ్రియ వివరించింది.
సాధారణంగానే సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని రాజమౌళి దగ్గరుండి చూసుకుంటారు. తన సినిమా చూసేందుకు థియేటర్కి వచ్చే అభిమానికి ఒక విజువల్ ఫీస్ట్ని ఇవ్వాలని తాపత్రయపడుతూ ఉంటారు. జక్కన్న సినిమా అంటే కచ్చితంగా మూడేళ్లు పడుతుందని అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు ఇంత కష్ట పడితే గానీ, అంత మంచి సినిమా రాదు. అయితే ట్రిపులార్ సినిమాకి రాజమౌళి ఆరోగ్యం పరంగానూ చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారంట. ఆ మాటలు మరెవరో చెప్పలేదు. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రియానే చెప్పింది. తాజాగా శ్రియ ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.
“ట్రిపులార్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు నుంచి రాజమౌళి ఆస్తమాతో బాధపడుతున్నారని తెలిసింది. అయినా ఆయన షూటింగ్ని మాత్రం ఆపలేదు. సెట్స్ లో ఎంత దుమ్ము ఉన్నా.. అలాగే పనిచేసేవారు. ఆయన దృష్టి మొత్తం సినిమాని ఎంత బాగా ప్రెజెంట్ చేయాలి అనే దానిపైనే ఉండేది. వెండితెరపై సినిమా అద్భుతంగా రావాలని ఎంతో తాపత్రయ పడుతూ ఉంటారు” అంటూ శ్రియ చెప్పుకొచ్చింది. ఇంక ట్రిపులార్ సినిమా పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఇటీవలే శాటర్న్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సన్ సెట్ సర్కిల్ అవార్డ్స్ లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా విజయం సాధించింది. ఇంక ఆస్కార్ బరిలో ట్రిపులార్ సినిమా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మొత్తం 15 విభాగాల్లో ట్రిపులార్ సినిమా ఆస్కార్ రేసులో ఉంది.