సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయకపోయినా.. ఒకప్పటి ఆయన సినిమాలు ఇప్పటికీ పలు ప్రసార మాధ్యమాల్లో అందర్నీ అలరిస్తున్నాయి. అలాంటి ఆర్పీ మహేష్ బాబు సినిమాకు పాడటమే తాను చేసిన పెద్ద తప్పని అంటున్నారు.
ఆర్పీ పట్నాయక్.. ఈ పేరు వినని తెలుగు సినీ అభిమానులు, అందులోనూ మ్యూజిక్ ఫ్యాన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. తన పాటలతో టాలీవుడ్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు ఆర్పీ. ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వే నువ్వే’, ‘జయం’, ‘నీ స్నేహం’ లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్స్ను ఆయన అందించారు. 2016 వరకు నిర్విరామంగా ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ, పాడుతూ ప్రేక్షకులను అలరించారు. పేరు ప్రతిష్టలతో పాటు పలు పురస్కారాలను కూడా అందుకున్నారు. అయితే ఆ తర్వాత నుంచి మాత్రం ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడం లేదు. క్రమంగా సినిమాలు తగ్గిస్తూ వచ్చిన ఆర్పీ.. ఇప్పుడు అటువైపు చూడటమే లేదు.
ఇన్నేళ్ల కెరీర్లో ‘నిజం’ సినిమా విషయంలో మాత్రం తాను రిగ్రెట్ ఫీలవుతానని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పైవ్యాఖ్య చేశారు. ‘నిజం’ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సింగర్ ఉషతో కలసి తాను ఎక్కువ భాగం పాటలను పూర్తి చేశానన్నారు ఆర్పీ పట్నాయక్. అయితే మహేష్కు తన వాయిస్ అస్సలు సెట్ కాలేదని.. తన గొంతు ఒక పిల్లాడి గొంతు అని ఆర్పీ చెప్పుకొచ్చారు. స్టార్ హీరోకు పాడాల్సిన గొంతు తనది కాదని.. చాలా మంది ‘నిజం’ టైమ్లో ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు. ఛాన్స్ ఉందని ఎలా పడితే అలా పాడేస్తావా అంటూ ముఖం మీదే అడిగేవారని ఆర్పీ చెప్పారు.