మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజుల నుంచి ‘మా’ఎలక్షన్స్ రగడ ఏ రేంజ్ లో కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మద్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది.. అంతే కాదు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగారు. మరో అడుగు ముందుకు వేసి ఫిర్యాదులు సైతం చేసుకున్నారు. మొత్తానికి ‘మా’ ఎన్నికలు ముగిశాయి. ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షడిగా మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే ‘మా’ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎన్నికల అధికారికి నటుడు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఎన్నికల హాల్ లో ఉన్నాడని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఏపిలో రౌడీ షీట్ ఉన్న వ్యక్తులు, బయట వాళ్లు ఓటర్లను బెదిరించారని.. తాము సీసీ టివి ఫుటేజ్ లు చూశామని.. అందులో ‘మా’కు సంబంధం లేని వ్యక్తులు ఉన్నట్లుగా ప్రకాశ్ రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
‘మా’ సభ్యులు కాని వారిని ఎన్నికల హాల్ లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకుని విష్ణు ప్యానల్ తిరిగిందని చెప్పారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు.